తెలంగాణ వర్సిటీకి ముగ్గురి పేర్లు
ABN, First Publish Date - 2021-02-09T08:59:15+05:30
రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీలను నియమించేందుకు తొలి అడుగు పడింది. ప్రభుత్వం 2019 సెప్టెంబరులో నియమించిన సెర్చ్ కమిటీలు నియామకాల ఉపకులపతుల నియామక ప్రక్రియను ప్రారంభించాయి.
రేపు ఓయూ, జేఎన్టీయూ, ఎంజీయూపై వీసీల సెర్చ్కమిటీ భేటీ
రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీలను నియమించేందుకు తొలి అడుగు పడింది. ప్రభుత్వం 2019 సెప్టెంబరులో నియమించిన సెర్చ్ కమిటీలు నియామకాల ఉపకులపతుల నియామక ప్రక్రియను ప్రారంభించాయి. తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించిన సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, హెచ్సీయూ వీసీ ప్రొఫెసర్ అప్పారావు, న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శివలింగ ప్రసాద్ ఉన్నారు. వీరు సోమవారం తెలంగాణ వర్సిటీ వీసీ పోస్టు కోసం వచ్చిన 114 దరఖాస్తులను పరిశీలించారు. వాటిల్లోంచి ముగ్గురు పేర్లను ఎంపిక చేశారు. ఈ జాబితాను గవర్నర్కు అందజేస్తారు. గవర్నర్ అందులోంచి ఒకరిని వీసీగా నియమిస్తారు. ఈ నెల 10న ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి సెర్చ్ కమిటీలు భేటీ కానున్నాయి. మిగతా వాటి సెర్చ్ కమిటీలను ఈ నెల 15లోపు నియమించనున్నారు. 20లోపు వీసీల నియామకాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.