తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

ABN , First Publish Date - 2021-02-21T05:45:08+05:30 IST

మెదక్‌ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో తాళం వేసిన రెండు ఇళ్లలో చోరీ జరిగింది. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపారు.

తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

ముస్లాపూర్‌లో వెండి, బంగారు ఆభరణాలతో పాటురూ.18 వేల నగదు అపహరణ

అల్లాదుర్గం, ఫిబ్రవరి 20 : మెదక్‌ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో తాళం వేసిన రెండు ఇళ్లలో చోరీ జరిగింది. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో  శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన నాయకుని లక్ష్మి ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌ వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు తొలిగించి ఇంట్లోకి చొరబడి బీరువాను ధ్వంసం చేశారు. బీరువాలో ఉన్న తులం బంగారు నగలు, 20 తులాల వెండి నగలతో పాటు రూ.18 వేల నగదును అపహరించుకుపోయారు. 

నర్సాపూర్‌లో రూ. లక్ష నగదు, 4 తులాల బంగారం..

నర్సాపూర్‌, ఫిబ్రవరి 20: కొడుకు పెళ్లికి షాపింగ్‌ చేయడానికి ఇంటికి తాళం వేసి వెళ్లిన వారు రాత్రి వచ్చే సరికి చోరీ జరిగిన ఘటన నర్సాపూర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు అబ్బాస్‌ కథనం ప్రకారం.. వినాయక్‌నగర్‌ కాలనీలో ఉండే అబ్బాస్‌ తమ కుమారిడి వివాహం కోసం శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి షాపింగ్‌ పూర్తి చేసుకుని అర్ధరాత్రి వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉన్నది. ఇంట్లోకి వెళికల చూడగా అల్మారాలో కొడుకు పెళ్లి కోసం దాచిన రూ.లక్ష నగదుతో పాటు నాలుగు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపాడు.

Read more