నిరుపయోగంగా సింగరేణి క్వార్టర్లు
ABN , First Publish Date - 2021-03-13T04:14:52+05:30 IST
మందమర్రి ఏరియాలోని సింగరేణి క్వార్టర్లు నిరుపయోగంగా మారాయి.
- అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిన వైనం
- అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాలని వినతులు
- పట్టించుకోని అధికారులు
మందమర్రి, మార్చి 12: మందమర్రి ఏరియాలోని సింగరేణి క్వార్టర్లు నిరుపయోగంగా మారాయి. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ క్వార్టర్లు అసాంఘీక కార్యక్రమాలకు నిలయంగా మారాయి. కాలనీలలో అంగన్వాడీ స్కూళ్ళ
ఏర్పాటు కష్టంగా ఉందని, సింగరేణి క్వార్టర్లను కేటాయించాలని సీడీపీఓ యాజమాన్యానికి వినతి పత్రం అందించారు. అయినా ఇప్పటివరకు యాజమాన్యం స్పందించలేదు.
ఏరియాలో 8వేల క్వార్టర్లు.....
మందమర్రి ఏరియాలో సుమారు 6000 మంది కార్మికులకుగాను సుమారు 8000 క్వార్టర్లు ఉన్నాయి. వీటిలో 3 వేల క్వార్టర్ల వరకు బెల్లంపల్లి పరిధిలో ఉండగా వాటిలో ఎస్ఆర్టీ క్వార్టర్లు శిధిలావస్థకు చేరుకొన్నాయి. మిగతా క్వార్టర్లు రామకృష్ణాపూర్, మందమర్రి ఏరియాలలో ఉన్నాయి. రామకృష్ణాపూర్లో ఎక్కువగా సింగరేణి క్వార్టర్లు కూలిపోయి అసాంఘిక కార్యక్రమాలకు నిలయమయ్యాయి.
అద్దెకు ఇవ్వాలని వినతులు....
సింగరేణి క్వార్టర్లకు మరమ్మతు చేసి మామూలు ధరకు అద్దెకు ఇవ్వాలని, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ స్కూల్లకు ఇవ్వాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సింగరేణి సీఎండీ శ్రీధర్ను కోరారు.
అంగన్వాడీలకు కేటాయిస్తే వేల రూపాయిల ఆదా...
ఏరియా పరిధిలో మోత్తం 97 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 23 కేంద్రాలు శాశ్వత, ఉచిత భవనాలలో నడుస్తున్నాయి. మిగతా 74 కేంద్రాలు కిరాయి ఇళ్ళలో నడుస్తున్నాయి. వాటికి సుమారు 1000 నుంచి 3000 వేల వరకు కిరాయి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏరియా పరిధిలోని 74 అంగన్వాడీ కేంద్రాలకు సింగరేణి క్వార్టర్లు కేటాయిస్తే, సింగరేణికి ఆదాయంతోపాటు లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, దీంతో ప్రభుత్వానికి వేల రూపాయలు ఆదా అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జీఎం కార్యాలయంలో దరఖాస్తు చేశాం....సీడీపీఓ హేమసత్య
- మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయంలో ఏరియాలోని 13 అంగన్వాడీ కేంద్రాలకు సింగరేణి క్వార్టర్లు కేటాయించాలని దరఖాస్తు చేశాం. యాజమాన్యం స్పందించలేదు. దీంతో అద్దె భవనాలలోనే నడుస్తున్నాయి.

