నేడే ‘తొలి’ పోరు!
ABN, First Publish Date - 2021-02-09T05:49:05+05:30
‘స్థానిక’ ఎన్నికల సంగ్రామంలో తొలిపోరుకు రంగం సిద్ధమైంది. నేడు జిల్లాలోని పది మండలాల్లో తొలివిడత పోలింగ్ జరగనుంది. మొత్తం 321 పంచాయతీలు, 2,920 వార్డుల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 39 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు, 1243 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 282 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాల కోసం 720 మంది పోటీ పడుతున్నారు. ఆరు వార్డులకు నామినేషన్లు పడలేదు. మిగిలిన 1,671 వార్డులకుగానూ 3,569 మంది బరిలో నిలిచారు. పకడ్బందీగా పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం సాయంత్రానికే ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు ఫలితాలు కూడా మంగళవారమే వెల్లడికానుండడంతో పంచాయతీ బరిలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది చర్చనీయాంశమవు తోంది.
- తొలిదశ ‘స్థానిక’ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
- ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ పోలింగ్
- చివరి గంట కొవిడ్ బాధితులకు కేటాయింపు
- సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
(శ్రీకాకుళం,ఆంరఽధజ్యోతి)
‘స్థానిక’ ఎన్నికల సంగ్రామంలో తొలిపోరుకు రంగం సిద్ధమైంది. నేడు జిల్లాలోని పది మండలాల్లో తొలివిడత పోలింగ్ జరగనుంది. మొత్తం 321 పంచాయతీలు, 2,920 వార్డుల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 39 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు, 1243 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 282 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాల కోసం 720 మంది పోటీ పడుతున్నారు. ఆరు వార్డులకు నామినేషన్లు పడలేదు. మిగిలిన 1,671 వార్డులకుగానూ 3,569 మంది బరిలో నిలిచారు. పకడ్బందీగా పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం సాయంత్రానికే ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు ఫలితాలు కూడా మంగళవారమే వెల్లడికానుండడంతో పంచాయతీ బరిలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది చర్చనీయాంశమవు తోంది.
--------------------------
తొలి విడత పంచాయతీ ఎన్నికల సమరం నేడు (మంగళవారం) జరగనుంది. జిల్లాలో మొత్తం 38 మండలాల్లో 1,190 పంచాయతీలు, 11,168 వార్డులు ఉన్నాయి. వీటిలో టెక్కలి, శ్రీకాకుళం, పాలకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో పది మండలాల్లో నేడు ఎన్నికలు జరుగనున్నాయి. లావేరు, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి, ఎల్ఎన్ పేట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం మండలాల్లో మొత్తం 321 పంచాయతీలకు తొలి విడతగా నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 39 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 282 పంచాయతీలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఇందుకుగాను 414 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్పంచ్ బరిలో 720 మంది ఉన్నారు. ఇక వార్డుల విషయానికొస్తే.. మొత్తం 2,920 వార్డులకుగాను...1,243 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరుచోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 1,671 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి 3,569 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 6.30 నుంచి 3.30 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. లెక్కింపు పూర్తయిన తరువాత విజేతను ప్రకటించి ధ్రువపత్రాలను అందజేయనున్నారు. పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నానికే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 37 రూట్లలో 44 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పోలింగ్కు సంబంధించి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రశాంతంగా సాగింది. ఎన్నికలు నిర్వహించనున్న మండలాల ప్రధాన కేంద్రాల్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు సోమవరం సామగ్రి పంపిణీ చేశారు. కలెక్టర్ నివాస్, జేసీలు సుమిత్కుమార్, శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ నవీన్ ఇతర అధికారులు సామగ్రి పంపిణీని పర్యవేక్షించారు. గతంలో ఎన్నడూ లేనంతగా కొవిడ్ దృష్ట్యా పోలింగ్ సమయాన్ని ఎన్నికల కమిషన్ పెంచింది. చివరి గంట సమయాన్ని కొవిడ్ బాధితుల కోసం కేటాయించింది. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకూ కొవిడ్ బాధితులు ఓటు వేసే అవకాశం కల్పించింది. ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఎటువంటి సమస్యపైనైనా 63099 90933 నంబర్కు మెసేజ్, వాట్సాప్ రూపంలో ఫిర్యాదు చేయవచ్చు.
పక్కా నిఘా...
ఎన్నికల ప్రక్రియ అంతా నిఘామయం చేశారు. ఇప్పటికే ఏర్పాట్లను కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్బర్దర్ పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీడియో కెమెరాలు ఏర్పాటు చేశారు. వెబ్కాస్టింగ్తో పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు. టెక్నాలజీతో అనుసంధానం చేసి ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసులు తొలిసారిగా బాడీవార్న్, హ్యండ్ హోల్డ్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించినా కెమెరాలో రికార్డ్ అవుతుంది. దీని ఆధారంగా వెనువెంటనే అరెస్ట్ చేస్తారు. భారీ బందోబస్తు కల్పించారు. 159 పంచాయతీల్లో 200 సాధారణ లొకేషన్లు, 84 పంచాయతీల్లో 110 సెన్సిటివ్ లొకేషన్లు, 67 పంచాయతీల్లో 95 హైపర్ సెన్సిటివ్ లొకేషన్లుగా తొలివిడత పోలింగ్ కేంద్రాలను పోలీసులు విభజించారు. ఈ ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు 9 ఉన్నట్లు గుర్తించి.. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకే పోలింగ్ ముగించేలా చర్యలు చేపట్టారు. స్ట్రయికింగ్ ఫోర్స్ 10, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్ 10, అలాగే సాధారణ పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు.
ఓటహక్కు వినియోగించుకోండి : కలెక్టర్ నివాస్
తొలివిడత ఎన్నికలు జరగనున్న 282 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ నివాస్ సూచించారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు తెరవరాదని మరోసారి స్పష్టం చేశారు.
2,123 మందితో బందోబస్తు...
జిల్లాలో తొలివిడత పోలింగ్కు 2,123 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. డీఎస్పీలు 8 మంది, సర్కిల్ ఇన్స్పెక్టర్లు 10మంది, సబ్ఇన్స్పెక్టర్లు 121 మంది, ఏఎస్ఐ/హెడ్కానిస్టేబుళ్లు 251 మంది, సాధారణ కానిస్టేబుళ్లు 553 మంది, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు 80మంది, హోంగార్డులు 400మంది, మహిళా ప్రొటెక్షన్ కార్యదర్శులు 700 మందితో బందోబస్తు సిద్ధం చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సాధారణ పోలింగు కేంద్రాలు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లోనూ భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ అమిత్బర్దర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో పర్యవేక్షణ చేపడుతున్నారు.