Mahesh Kumar Goud: నీకు వెన్నుపోటు ఖాయం.. జాగ్రత్త కేసీఆర్..: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:19 PM
ఒక నెలలోపు పెండింగులో ఉన్న పదవులు అన్నీ భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్ఫష్టం చేశారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి అపూర్వ ఆదరణ వస్తోందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సర్పంచ్లను కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.
ఢిల్లీ, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీశ్రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్రావుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఏ క్షణంలోనైనా హరీశ్రావు వెన్నుపోటు పొడుస్తారని.. ఈ విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరికైనా సీఎం కావాలని ఉంటుంది కదా అని (హరీశ్రావును ఉద్దేశించి) విమర్శలు గుప్పించారు మహేశ్ కుమార్ గౌడ్.
సోషల్ మీడియాను కేటీఆర్ మ్యానేజ్ చేస్తున్నారు..
ఢిల్లీలో మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ(ఆదివారం) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్కు ఫ్యూచర్ ఉంటే కవిత ఎందుకు బయటకు వచ్చేదని ప్రశ్నల వర్షం కురిపించారు. మాజీ మంత్రి కేటీఆర్కి డబ్బులుండటంతోనే సోషల్ మీడియాను మ్యానేజ్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదని.. వారు కళలు కంటున్నారని ఎద్దేవా చేశారు మహేశ్ కుమార్ గౌడ్.
డీసీసీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం..
‘తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయమే ఫైనల్. డీసీసీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం పెరిగింది. రాష్ట్ర కేబినెట్లోకి నేను వెళ్లే ప్రసక్తే లేదని.. కేవలం ప్రచారం మాత్రమే చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవితో చాలా సంతోషంగా ఉన్నాను. రాష్ట్ర మంత్రికి లేని ప్రాధాన్యం టీపీసీసీ అధ్యక్షుడికి ఉంది. మా ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కేసీ వేణుగోపాల్ నన్ను మంత్రి పదవి తీసుకుంటావా అని అడిగారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి గురించి సీఎం రేవంత్రెడ్డి పట్టుదలతో ఉన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్తో ఎవరూ పోటీ పడలేని విధంగా అభివృద్ధి చేస్తాం. సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ డెవలప్మెంట్పై ఓ విజన్ ఉంది. తెలంగాణలో మా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు’ అని వ్యాఖ్యానించారు మహేశ్ కుమార్ గౌడ్.
మా ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు..
‘మా ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యుత్తో గ్రామాల్లోని ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక నెలలోపు పెండింగులో ఉన్న పదవులు అన్నీ భర్తీ చేస్తాం. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉంది. పార్టీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సర్పంచ్లను కాంగ్రెస్ గెలిచింది. ఇతర రాష్ట్రాల కన్నా హైదరాబాద్లో ప్రశాంత వాతావరణం ఉంది. అనేక మంది హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. ఫోర్త్ సీటు ఏర్పాటుతో నగరంలో అభివృద్ధి జరుగుతోంది. భాగ్యనగర అభివృద్ధిని ఎవరు ఆపలేరు. హైదరాబాద్ ఇండియాలో బెస్ట్ సిటీ అవుతుంది. వచ్చే ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుంది. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు మహేశ్ కుమార్ గౌడ్.
ఈ వార్తలు కూడా చదవండి..
పుస్తక మహోత్సవ ప్రాంగణానికి అందెశ్రీ పేరు
తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
Read Latest Telangana News and National News