Share News

రైతుబంధు ఎగ్గొట్టింది బీఆర్ఎస్.. ఇచ్చింది రేవంత్ సర్కార్: తుమ్మల

ABN , Publish Date - May 07 , 2026 | 01:42 PM

రైతులందరూ ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రసాయనాల వాడకాన్ని తగ్గించకపోతే వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు.

రైతుబంధు ఎగ్గొట్టింది బీఆర్ఎస్.. ఇచ్చింది రేవంత్ సర్కార్: తుమ్మల
Thummala Nageswara Rao

హనుమకొండ, మే 7 (ఆంధ్రజ్యోతి): రైతులందరూ ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. రసాయనాల వాడకాన్ని తగ్గించకపోతే వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) హనుమకొండలో జరిగిన రైతుమేళాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. నిన్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిపై చౌవకబారు వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. రుణమాఫీపై కేటీఆర్ అండ్ కో అసత్యాలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కి లేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు ఎగ్గొడితే సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చారని ప్రస్తావించారు.


యుద్ధం వల్ల యూరియా ఆగిపోయినా మన రైతులకు యూరియా అందించామని మంత్రి తుమ్మల తెలిపారు. యూరియాపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా రూ.లక్షకోట్లను రైతుల కోసం ఖర్చుపెట్టామని తెలిపారు. కేసీఆర్ హయాంలోని అవినీతి, అహంకారాన్ని రైతులు ఎప్పటికీ మరచిపోరని చెప్పుకొచ్చారు. కాకతీయుల గడ్డపై కేటీఆర్ అండ్ కో చేసిన ప్రసంగాన్ని ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. మొక్కజొన్నలు కొనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ధాన్యం, మొక్కజొన్నలు వీలైనంత త్వరగా కొనుగోలు చేయాలని వేదికపైనే కలెక్టర్లను ఆదేశిస్తున్నానని అన్నారు.


దేశంలో రైతులకు యూరియా అందించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులకు సంబంధించిన అంశంలో వెనకడుగు వేయబోమని అన్నారు. బీఆర్ఎస్ నేతలు కొంతమంది తనను అవమానపరచాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. అన్నదాతలు పంట మార్పిడి చేయాలని, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్

హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

బయో టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 07 , 2026 | 01:47 PM