రైతుల హక్కులకు భంగం వాటిల్లితే సహించబోం.. హైడ్రాకు మంద కృష్ణ మాదిగ వార్నింగ్
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:22 PM
హైడ్రాపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని వివాదంలో ఉన్న భూముల రైతులను మంద కృష్ణ మాదిగ, హైకోర్టు అడ్వకేట్ ముఖీం పరామర్శించారు.
సంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): హైడ్రాపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈరోజు (బుధవారం) అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని వివాదంలో ఉన్న భూముల రైతులను మంద కృష్ణ మాదిగ, హైకోర్టు అడ్వకేట్ ముఖీం పరామర్శించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడారు. ఐలాపూర్లోని సర్వే నంబర్ -1 నుంచి 220 వరకు గల 1265 ఎకరాల భూమి భూ వివాదంలో పేద రైతులను హైడ్రా ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద భూములతో సంబంధం లేని రైతులను భయబ్రాంతులకు గురిచేయటం దారుణమని మంద కృష్ణ మాదిగ చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న కేసుల్లో తీర్పు వచ్చేంతవరకు హైడ్రా అధికారులు సంయమనం పాటించాలని సూచించారు. కోర్టు పరిధిలో లేని భూములకు సంబంధించిన రైతుల జోలికి హైడ్రా, రెవెన్యూ అధికారులు రావొద్దని కోరారు. రైతులకు ఉన్న లీగల్ హక్కులకు భంగం వాటిల్లితే సహించబోమని హెచ్చరించారు.
ఏదైనా కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్న కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా దృష్టి పెడితే ఏ సమస్య ఉండదని తెలిపారు. హైడ్రా తన పరిధిలో పనిచేస్తుందా, అతిక్రమిస్తుందా అనే ఆంశంపై ఒకసారి ముఖ్యమంత్రి పరిశీలించాలని అన్నారు. హైడ్రా పరిధిలో ఉన్న భూ వివాదాలు పరిష్కారానికి ప్రత్యేక కోర్టు అవసరం ఉందని చెప్పుకొచ్చారు. హైడ్రా అనవసర జోక్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ అభివృద్ధి మోడల్ కేరళలో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: డీజీపీ శివధర్ రెడ్డి
కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాజెక్టులు కట్టారు: మహేశ్ కుమార్ గౌడ్
Read Latest Telangana News And AP News And International News And Telugu News