33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:46 PM
మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకం కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న(శనివారం) సాయంత్రం మహిళల గురించి మాట్లాడారని తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకం కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న(శనివారం) సాయంత్రం మహిళల గురించి మాట్లాడారని తెలిపారు. 2027 జనగణన తర్వాత డీలిమిటేషన్ జరగాలని.. కానీ మోదీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం 16,17,18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టారని ప్రస్తావించారు. ఈరోజు(ఆదివారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని తెలిపారు. 2024 తర్వాత మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
ఇండియా కూటమిపై బీజేపీ దుష్ప్రచారం..
543 లోక్సభ స్థానాలకు 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఇద్దరు లోక్సభ సభ్యులు తప్ప అందరూ ఒప్పుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 2027 జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పిందే మోదీ, అమిత్ షాలని చెప్పుకొచ్చారు. 33 శాతం రిజర్వేషన్లు ఇప్పుడు అమలు చేసినా తమకు ఇబ్బందేమిలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమిపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. తాము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని.. డీలిమిటేషన్కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ చేయాలంటే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
గత విధానాలను అమలు చేయాలి..
ఉత్తర భారతం, దక్షిణ భారతం మధ్య అంతరం లేకుండా డీలిమిటేషన్ చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఇందిరాగాంధీ, వాజ్పేయి అనుసరించిన విధానాలను అమలు చేయాలని కోరారు. డీలిమిటేషన్ను ఇష్టం వచ్చినట్లుగా చేసుకుని ఎప్పటికీ అధికారంలో ఉండాలని బీజేపీ భావించడంతోనే తాము వ్యతిరేకించామని అన్నారు. బీజేపీ చేసే దుష్ప్రచారాన్ని మహిళలు పట్టించుకోవద్దని సూచించారు. ఎస్ఐఆర్ను ఏ విధంగా అమలు చేసి.. వారి ఇష్టం వచ్చినట్లుగా ఎలా ఓట్లు తొలగించారో చూశామని ప్రస్తావించారు. అలాగే, డీలిమిటేషన్ ద్వారా వారి ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బీజేపీ మిత్రపక్షాలకు భవిష్యత్తులో ఇబ్బందులే: సీఎం రేవంత్ రెడ్డి
నారీ శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేసింది.. మహేశ్వర్ రెడ్డి ధ్వజం
బయటకు వస్తే పులి సంగతి చెబుతాం.. కేసీఆర్పై మహేశ్ గౌడ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And International News And Telugu News