బయటకు వస్తే పులి సంగతి చెబుతాం.. కేసీఆర్పై మహేశ్ గౌడ్ సెటైర్లు
ABN , Publish Date - Apr 18 , 2026 | 05:29 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాలలో పాల్గొననున్న మీటింగ్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. బయటకు వస్తే పులి సంగతి చెబుతామని హెచ్చరించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) జగిత్యాలలో పాల్గొననున్న మీటింగ్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శలు చేశారు. బయటకు వస్తే పులి సంగతి చెబుతామని హెచ్చరించారు. పులి ఎన్ని మేకలు తిన్నదో చెబుతామని.. పులి ఎన్ని ఆవులను మింగిందో చెబుతామని పేర్కొన్నారు. పులి ఆసరా తీసుకొని ఎన్ని పిల్లులు లాభపడ్డాయో బయటపెడుతామని వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పులి ఏం చేసిందో ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన అన్ని విషయాలు బయటపెడతామని హెచ్చరించారు. ఈరోజు (శనివారం) గాంధీభవన్లో మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్రనే లేదు..
స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్రనే లేదని మహేశ్ గౌడ్ విమర్శలు చేశారు. బీజేపీ ఎంపీలు యాక్సిడెంటల్ లీడర్స్ అని ఆక్షేపించారు. మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్పా బీజేపీ ఎంపీలకు ఏం తెలియదని సెటైర్లు గుప్పించారు. కర్ణాటక ఎంపీ తెలంగాణను కించపరిస్తే రాష్ట్ర బీజేపీ ఎంపీలు నిద్రపోయారా..? అని ధ్వజమెత్తారు. నలభై ఏళ్లలో కిషన్రెడ్డి ఒక్క బీసీ నాయకుడినైనా తయారు చేశారా..? అని ప్రశ్నించారు.
మహిళా సాధికారతపై కాంగ్రెస్, బీజేపీకి చాలా తేడా ఉంది..
మహిళా సాధికారతపై కాంగ్రెస్, బీజేపీకి చాలా తేడా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్తావించారు. తొలి మహిళా ప్రధాని, రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. సోమవారం మహిళా బిల్లును పార్లమెంట్లో పెట్టాలని.. కానీ ఈ బిల్లు ముసుగులో మోదీ ప్రభుత్వం డీ లిమిటేషన్ చేయాలనే ప్రయత్నం చేసిందని ఆగ్రహించారు. అక్రమంగా బిల్లును పాస్ చేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. ఈ బిల్లు వీగిపోవడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. అహంకారంతో ఉంటామంటే నిన్నటిలా జరుగుతుందని అన్నారు. ఉత్తర భారతదేశానికి ఎక్కువ సీట్లు ఇచ్చే ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని చెప్పుకొచ్చారు. బీజేపీ నియంతృత్వ పోకడకు చెక్ పడిందన్నారు. ఈ బిల్లు వీగిపోవాలనే డీ లిమిటేషన్తో ముడిపెట్టారని తెలిపారు. తెలంగాణలో రెడ్డి ముఖ్యమంత్రి బీసీ కుల గణన చేశారని పేర్కొన్నారు.
కిషన్రెడ్డికి మహేశ్ కుమార్ గౌడ్ సవాలు..
కిషన్రెడ్డికి మహేశ్ కుమార్ గౌడ్ సవాలు విసిరారు. జై శ్రీరామ్ అనకుండా కిషన్రెడ్డి గెలవగలరా..? అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే మిషన్ రెడ్డికి శ్రీరాముడు కావాలని విమర్శించారు. జై శ్రీరామ్ అనకుండా తాను చేసిన అభివృద్ధిపై ప్రచారం చేసి కిషన్రెడ్డి గెలవగలరా..? అని నిలదీశారు. జై శ్రీరామ్ అనకుంటే బీజేపీకి మనుగడ లేదని అన్నారు. దేవుడి పేరు చెబితే ఓట్లు రాలే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
తేజస్వీ చిన్న పిల్లోడు..
తేజస్వీ చిన్న పిల్లోడని మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. తేజస్వీ దేవుడి పేరు చెప్పుకొని గెలిచిన వారని విమర్శించారు. ఆయన యాక్సిడెంటెల్గా ఎంపీ అయ్యారని ఎద్దేవా చేశారు. కర్ణాటక గురించే తేజస్వికి ఏమాత్రం తెలియదని అన్నారు. తెలంగాణ గురించి తేజస్వికి ఏం తెలుసని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లను బీసీలకు ఇచ్చామని స్పష్టం చేశారు. మనువాద బీజేపీకి మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అత్యధికంగా మహిళా నాయకులను తయారు చేసింది కాంగ్రెస్ అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ శివధర్ రెడ్డి
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం చారిత్రాత్మకం: రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై మా ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదు: మంత్రి ఉత్తమ్
Read Latest Telangana News And AP News And International News And Telugu News