రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ శివధర్ రెడ్డి
ABN , Publish Date - Apr 17 , 2026 | 07:04 PM
రోడ్డు భద్రతపై ప్రజలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. మనల్ని మనం కాపాడుకుందామనుకునే లోపే ప్రమాదం జరిగిపోతుందని తెలిపారు.
సిద్దిపేట జిల్లా, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు భద్రతపై ప్రజలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP Shivdhar Reddy) పలు కీలక సూచనలు చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గజ్వేల్ మహతి ఆడిటోరియంలో ఈరోజు(శుక్రవారం) ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ శివధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి, కమిషనర్ రష్మీ పెరుమాళ్, ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు. మనల్ని మనం కాపాడుకుందామనుకునే లోపే ప్రమాదం జరిగిపోతుందని తెలిపారు. వాహనాలు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టెక్ చేయడం చాలా తప్పు, ప్రమాదమని హెచ్చరించారు. వాహనాలకు ఎడమ వైపునకు మాత్రమే నడపాలని సూచించారు.
రైట్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేసిన తర్వాత తిరిగి లెఫ్ట్ సైడ్కి వచ్చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మీరే వాహనాన్ని నడపడమే కాదని.. ఎదుటి వారి డ్రైవింగ్ను కూడా పరిశీలించాలని చెప్పుకొచ్చారు. హైవే మీద వాహనంతో వెళ్లే వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఫోర్ వీలర్ నడిపే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. ఆటో డ్రైవర్లు ఖాకీ యూనిఫాం ధరించి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఆటో వాళ్లు వారి గౌరవ ప్రతిష్ఠలను కాపాడుకోవాలని మార్గనిర్దేశం చేశారు. సమాజంలో మీ మీద గొప్ప నమ్మకం ఉందని తెలిపారు. రోడ్డు భద్రతలపై ఎక్కడి నుంచో వచ్చి తాము చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీకు మీరుగా బాధ్యత కలిగి ఉండాలని.. చేయి పోయినా, కాలు పోయినా సరిపెట్టుకోవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగిరాదనే విషయాన్ని వాహనదారులు గుర్తుంచుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్కు తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్.. నీ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. మహేశ్ గౌడ్ సవాల్
ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు
Read Latest Telangana News And AP News And International News And Telugu News