కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్కు తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Apr 14 , 2026 | 09:55 PM
మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మర్యాదను తగ్గించేలా ఎప్పుడూ తాము మాట్లాడలేదని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జీవన్ రెడ్డిని (Jeevan Reddy) ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM RevanthReddy) వ్యాఖ్యానించారు. ఆయన మర్యాదను తగ్గించేలా ఎప్పుడూ తాము మాట్లాడలేదని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదని తెలిపారు. 2023 ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం అంతా కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో రేవంత్ రెడ్డి ఈరోజు (మంగళవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్య, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. జీవన్ రెడ్డి లాంటి వారు పార్టీ వీడినా, తాము కాంగ్రెస్లోనే కొనసాగుతామని ముఖ్య నాయకులు స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం..
ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని నేతలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ను రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కలసికట్టుగా పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డికు నేతలు వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయనను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించామని అన్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని కోరితే పార్టీ టికెట్ ఇచ్చిందని ప్రస్తావించారు. దురదృష్టవశాత్తు జీవన్ రెడ్డి ఓడిపోయారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి సూచించిన వారికే టికెట్లు ఇచ్చామని చెప్పారు. భవిష్యత్తులో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చినా జీవన్ రెడ్డి వినలేదని అన్నారు. మొండిపట్టుతో జీవన్ రెడ్డి పార్టీ వీడారని తెలిపారు. 40 ఏళ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి దుర్మార్గుడైన కేసీఆర్తో జతకట్టారని అన్నారు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరమని చెప్పుకొచ్చారు.
ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు..
జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్కు తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన వయసుకు, అనుభవానికి ఇది తగదన్నారు. ఈనాటికీ తాను ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు. కుట్రలను తిప్పి కొట్టాలని తాము ప్రయత్నం చేస్తుంటే జీవన్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్లో చేరారని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెట్టడం తప్పా..? అని ప్రశ్నించారు. తాను చేస్తుంది మంచో, చెడో ప్రజలే ఆలోచించాలని అన్నారు. ఎవరు ఏమిటన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు. అండగా నిలబడాలని... మళ్లీ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని.. త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తానని స్పష్టం చేశారు. అంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. వ్యక్తికంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన కాంగ్రెస్ శ్రేణులు అందరినీ అభినందిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీలిమిటేషన్తో ఆ రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం: సీఎం రేవంత్ రెడ్డి
లవ్ జిహాద్ కేసుపై బండి సంజయ్ ఘాటు స్పందన
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా.. అడ్వకేట్కు డ్రంకెన్ టెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News