నిజం కోసం నిలబడితే.. నిజమే మనల్ని నిలబెడుతుంది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 09 , 2026 | 08:17 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి మూడేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
అమరావతి, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును (AP CM Chandrababu Naidu) అక్రమంగా అరెస్టు చేసి మూడేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఎక్స్(X) వేదికగా సీఎం భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ప్రజల కోసం నిలబడితే... ప్రజలు మన వెంట నిలబడతారని వ్యాఖ్యానించారు. నిజం కోసం నిలబడితే... నిజమే మనల్ని నిలబెడుతుందని.. ఇదీ తన నమ్మకమని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం కుట్ర పూరితంగా జరిగిన ఓ పరిణామం తనలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచిందని తెలిపారు.
నా స్థైర్యాన్ని దెబ్బకొట్టలేకపోయారు..
‘గత ప్రభుత్వ హయాంలో ఇదే రోజున ఏ తప్పూ చేయని నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించారు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు.. లొంగిపోలేదు. దీనికి కారణం నాకు లభించిన ప్రజా మద్దతు. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం తెలుగు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు నిలబడ్డారు. నాటి నిర్భంధ పరిస్థితుల్లో ప్రజలు చూపిన సంఘీభావం, తెగువ నా జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం. నన్ను నిర్బంధించగలిగారు... కానీ దేశ విదేశాల్లో నా కోసం మీరెత్తిన గొంతును నొక్కలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని గెలిపించేందుకు మీరు పోరాడారు. 2024 ఎన్నికల్లో ఓటు ద్వారా మరింత బలంగా ప్రజలు మద్దతును చాటారు. కక్షసాధింపు రాజకీయాలను ఓడించి.... నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను అప్పగించారు. నాటి ఘటనలను, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజల కోసం మరింత కష్టపడాలనే సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతిని నంబర్ వన్ చేయాలనే నా కలను మీ అందరి సహకారంతో నిజం చేస్తానని మాట ఇస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News