Telangana Government: ఆపరేషన్ సిందూర్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ABN , Publish Date - May 09 , 2025 | 09:15 PM
Telangana Government: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించి మాక్ డ్రిల్ చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.

హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పోలీస్ అధికారులు సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. ఇవాళ(శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన హై లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, సీఎంవో స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, డీజీపీ జితేందర్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, అవినాష్ మహంతి, సుధీర్ బాబు, తదితరులు పాల్గొన్నారు. డిఫెన్స్ మాక్ డ్రిల్, భద్రతలు, రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మల్లు భట్టి విక్రమార్క చర్చించారు.
ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా నిత్యం సమాచారం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించి మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించారు.
రాజీవ్ యువ వికాసం పురోగతిపై చర్చ...
అలాగే రాజీవ్ యువ వికాసం పురోగతిపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్దేశించిన క్యాలండర్ ప్రకారం రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి అవ్వాలని ఆదేశించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన మంజూరు పత్రాలు పంపిణీకి సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి 25వ తేదీలోగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ లోగా ఎంపికైన లబ్ధిదారులకు సంబంధించిన సాంక్షన్ పత్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందులో ఎలాంటి జాప్యం జరగకుండా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
కాంగ్రెస్పై అసత్య ప్రచారం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఆపరేషన్ సిందూర్పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు గాంధీ భవన్లో కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాంగ్రెస్ పార్టీని కొంతమంది డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్కు తాము వ్యతిరేకం అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే దూరదర్శన్ చానల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫొటోలతో ప్రసారం చేశారని చెప్పారు. ఈ విషయంపై జాతీయ కాంగ్రెస్ పరువునష్టం దావా వేసిందని గుర్తుచేశారు. పాకిస్తాన్పై భారత్ మొదలు పెట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలను కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా త్రివిధ దళాలకు మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశామని తెలిపారు. తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి త్రివిధ దళాలతో ర్యాలీ చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ మద్దతు...
‘పార్టీలకు అతీతంగా త్రివిధ దళాలు తీకునే నిర్ణయానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. ఇప్పటికి 4సార్లు పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన మూడుసార్లు దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1947లో జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్నారు. 1965లో లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధాన మంత్రిగా ఉండగా ఆపరేషన్ గ్రిబ్లాటర్ జరిగింది. 1971లో బంగ్లాదేశ్ ప్రత్యేక దేశం కోసం ఈస్ట్ పాకిస్తాన్పై ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు యుద్ధం జరిగింది. 1999లో అటల్ బీహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది. కాంగ్రెస్ అన్నివిధాలుగా సహకరించింది. సోఫియా ఖురేషి, యువీకసింగ్ ఇద్దరు మహిళలు ఈ యుద్ధంలో పాల్గొన్నారు. ఇద్దరు మహిళలు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్పై దాడి చేయడం దేశం గర్విస్తుంది. ఏప్రిల్ 25న IMF 7 బిలియన్ డాలర్ల లోన్ సాంక్షన్ చేయాలని చూస్తే.. పాకిస్తాన్ IMFతో ఉగ్ర చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడు యుద్ధం సమయంలో ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటుంది’ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..
Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..
Read Latest Telangana News And Telugu News