ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనే మొక్కను మొలవనివ్వను: సీఎం రేవంత్రెడ్డి
ABN , Publish Date - Sep 05 , 2026 | 06:59 PM
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరిగితే 117 సీట్లలో గెలుస్తామని, సీట్లు పెరగకపోతే 97 సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నల్లగొండ, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరిగితే 117 సీట్లలో గెలుస్తామని, సీట్లు పెరగకపోతే 97 సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. 2024 నుంచి 2034 వరకు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.. ఇదే బీఆర్ఎస్, బీజేపీలకు తన సవాల్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అనే మొక్కను ఏ ఎన్నికల్లోనూ తాను మొలవనివ్వనని హెచ్చరించారు. ఈ నెలాఖరుకు సిరిసిల్లకు వస్తా... మూడు రంగుల జెండా ఎగురవేస్తా.. వచ్చేనెల సిద్దిపేటపై దండయాత్ర చేస్తా.. కాస్కోవాలని సవాల్ చేశారు.
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్రెడ్డి ఈరోజు (శనివారం) పర్యటించారు. ఈ పర్యటనలో రూ.345 కోట్లతో 12 అభివృద్ధి పనుల శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. నకిరేకల్లో 100 పడకల ప్రభుత్వాస్పత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో పలు విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు రఘువీర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగించారు.
మీరిచ్చిన రైతు రుణమాఫీ మిత్తిలకే సరిపోయింది..
‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో గొప్ప పథకాలు అమలు చేస్తే కొంతమంది జీర్ణించుకోలేక.. ఊరూరు తిరుగుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన... మా హయాంలోని వెయ్యి రోజుల పాలనను బేరీజు వేసుకోండి. మీరిచ్చిన రైతు రుణమాఫీ మిత్తిలకే సరిపోయింది. చివరి రైతు భరోసా వేస్తానని మోసగించి కేసీఆర్ గద్దె దిగారు. మీరు ఎగ్గొట్టిన రైతు భరోసా 32 నెలల్లో రూ.36 వేల కోట్లను రైతులకు మేము చెల్లించాం. ధాన్యం కొనుగోళ్లు, రైతు భరోసా, రుణమాఫీ 30 నెలల్లో చెల్లించాం. కోటి మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరికీ నెలకు రూ.10 వేల చొప్పున ఖర్చులు మిగిలాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడం కోసం అన్ని పథకాల్లో వారిని భాగస్వామ్యం చేశాం. కేసీఆర్ ఏనాడైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారా.?, మేము ఇచ్చే పథకాలు ఏమైనా ఇచ్చారా.?. ఫాంహౌస్కు పరిమితమైన కేసీఆర్ పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగదు. మీరే నోటిఫికేషన్లు ఇస్తే ఎందుకు మీ హయాంలో నియామకాలు చేపట్టలేదు. 72వేల ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే.. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది’ అని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు.
కాకుల్లా ఊరు మీద బడి దోచుకునేందుకు తిరుగుతున్నారు..
‘కేసీఆర్ సీఎం అయితే హరీశ్రావు, కేటీఆర్లను మంత్రులను చేశారు. నేను సీఎం అయితే అందరికీ మంత్రి పదవులు, ఎంపీ పదవులు, ఎమ్మెల్సీలను చేశా. కేసీఆర్ సీఎం అయితే ఆయన విగ్రహం కోసం ఐదెకరాలకు కాంపౌండ్ పెట్టారు. కాకుల్లా ఊరు మీదబడి దోచుకునేందుకు తిరుగుతున్నారు. మా పాలనను చూసి బావ, బామ్మర్థులు గుక్క పెట్టి ఏడుస్తున్నారు. నాకు చదువు లేదని అంటున్నారు.. సంస్కారం ఉంది. కాబట్టే మీరు ఇలా ఉన్నారు. రాఖీ కట్టడానికి వచ్చిన సొంత చెల్లిని మెడబట్టి కేటీఆర్ గెంటారు. గుంటూరులో చదివిన నువ్వు తెలంగాణ కోసం ఏం చేశావ్. రాష్ట్రంలో కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లలో పది వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుందని.. పార్టీ నుంచి, ఇంటి నుంచి ఆడబిడ్డను గెంటేశారు. మీరు మా ఆడబిడ్డలకు పథకాలు అందిస్తారా.?. సొంత ఆడబిడ్డను చూసుకోలేని వారు.. సమాజంలోని ఆడబిడ్డల బాగోగులు చూస్తారా.?. ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించడానికి మేము సిద్ధం. మీరు అసెంబ్లీకి రావాలి. చేతనైతే తండ్రి, కొడుకులు అసెంబ్లీకి రావాలని... అన్ని విషయాలపై చర్చిద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా రూ.22.1 కోట్లు జీతం తీసుకుని ఫామ్ హౌస్లో ఉన్నారు’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్రెడ్డి
సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News