Share News

కేసీఆర్ ఫాంహౌస్ భూములపై మా దగ్గర ఆధారాలు.. సమాధానం చెప్పాల్సిందే: పొంగులేటి

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:23 AM

మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓవర్ లాప్ ల్యాండ్‌పై కేసీఆర్ తిష్ఠ వేశారని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

కేసీఆర్ ఫాంహౌస్ భూములపై మా దగ్గర ఆధారాలు.. సమాధానం చెప్పాల్సిందే: పొంగులేటి
Telangana Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌పై (KCR) తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) సంచలన ఆరోపణలు చేశారు. ఓవర్ లాప్ ల్యాండ్‌పై కేసీఆర్ తిష్ఠ వేశారని ఆరోపించారు. చట్టబద్ధంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇబ్బంది ఉండదని.. సర్వే చేసి ఎక్కువ, తక్కువ ఉంటే కేసీఆర్‌కు నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈరోజు (శుక్రవారం) అసెంబ్లీలో మీడియాతో మంత్రి పొంగులేటి చిట్‌చాట్ చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ అసైన్డ్ భూముల్లో పట్టాలు ఉన్న వారిని తాము ఇబ్బంది పెట్టమని తేల్చిచెప్పారు. పట్టాలు ఉన్న వారిని ఇబ్బంది పెట్టామని అన్నా రు. అసైన్డ్ భూములకు పట్టాలు పొందిన వారిని అధికారులు ఇబ్బంది పెడితే అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


లాప్ భూమి లెక్క తేలాల్సి ఉంది..

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద రైతులు, స్థానికులతో కావాలని తమ ప్రభుత్వం గురించి మాట్లాడిస్తున్నారని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. వెంకటారపురం, ఎర్రవల్లి గ్రామాల మధ్య ఓవర్ లాప్ భూమి ఉందని.. వాటిపై లెక్క తేలాల్సి ఉందని తెలిపారు. అసైన్డ్‌మెంట్ భూమి ఉండాల్సిన అంత లేదని.. బినామీ పేర్లతో బదిలీ జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్దోళ్లున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన విషయంలో డాక్యుమెంట్ల ప్రూప్ ఉందని తెలిపారు. తాము అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కొనాపురం గ్రామానికి ఎప్పుడు వలస పోయారని.. అమ్మిన భూముల డబ్బులు ఏ బ్యాంకులో ఉన్నాయని ప్రశ్నించారు.


2004 ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు చూపించలేదు..

వందల ఎకరాల భూమి ఉంటే 2004 ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు చూపించలేదని మంత్రి పొంగులేటి నిలదీశారు. ఒరిజినల్ జమిందార్ అయితే 2004లో కేసీఆర్ ఎందుకు ఈ ఆస్తిని చూపించలేదని ప్రశ్నించారు. ఒక ఎకరం ఉందని కేసీఆర్ చూపించారని ప్రస్తావించారు. ఒరిజినల్ పట్టా ఉన్న దాంట్లో బయట వారు ఉన్నారా.?, వేరే వాళ్లు ఉన్నారా.? అనేది తెలియాలి? అని అన్నారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో ఏమి పెట్టారు, ఉన్నది ఎంత? అని నిలదీశారు. పట్టాలు లేకుండా ఇంకొకరు పొజిషన్‌లో ఉంటే ఏమి చేయాలో ఆలోచిస్తామని అన్నారు. దళితులకు, గిరిజనులకు సంఘీభావం చెప్పడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు వెళ్తారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తాము ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారని అన్నారు.


అధికార దుర్వినియోగం చేసి భూములు కొల్లగొట్టారు..

దళితులు ఫాంహౌస్ దగ్గర నిలబెడితే పసుపు నీళ్లు చల్లారని మంత్రి పొంగులేటి దుయ్యబట్టారు. వాళ్లు దళితుల గురించి మాట్లాడుతారని... అధికార దుర్వినియోగం చేసి భూములు కొల్లగొట్టారని ఆగ్రహించారు. ఒక ఎకరం కూడా లేదని.. అన్నవారికి ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నల వర్షం కురిపించారు. వట్టి నాగులపల్లి భూమి తనది కాదని స్పష్టం చేశారు. లీజ్‌కు తీసుకొని డెవలప్ చేస్తున్నామని తేల్చిచెప్పారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఎలక్షన్ అఫిడవిట్‌లో 13 ఎకరాల భూమి ఉందని చూపించారని... కానీ ఓ ట్రస్ట్ పెట్టి మొత్తం భూములు ఆయన దానిలోకి మార్చారని ఆరోపించారు. 2004 నుంచి 2023 వరకు ఏం చేస్తే వారికి ఇంత ఆస్తి వచ్చింది? అని నిలదీశారు, ఫ్రీడమ్ ఫైటర్ దగ్గర కొన్నామని హరీశ్‌రావు చెప్పిన మాటలు బోగస్ అని విమర్శించారు. ఎన్నికల ముందు హరీశ్‌రావు మామ హనుమంత రావు అసైన్డ్ ల్యాండ్‌ను పట్టా ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. రంగనాయక్ సాగర్‌లో హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రిగా ఉనప్పుడు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ల్యాండ్‌ను తీసేయించి 13 ఎకరాలకు 2.13 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. U టైపులో ఉన్న భూమిని sudaకు ఇచ్చారని తెలిపారు. ఈ ల్యాండ్ టచ్ అయ్యే విధంగా రూ.5.40కోట్లతో హరీశ్‌రావు రోడ్డు వేయించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

ఆ భూమిని హరీశ్‌రావు కుటుంబం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది?: మంత్రి పొంగులేటి

అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా: రాకేశ్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 01:47 PM