మజ్లిస్ ఒత్తిడితో జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారు.. రేవంత్ సర్కార్పై రామచందర్రావు ధ్వజం
ABN , Publish Date - May 26 , 2026 | 12:58 PM
ఇందిరమ్మ ఇళ్లపేరుతో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి సర్కార్ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లపేరుతో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు (Ramchander Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి సర్కార్ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. ఈరోజు (మంగళవారం) కూకట్పల్లి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రామచందర్రావు మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా హైదరాబాద్లోని పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు.
డివిజన్ల ఏర్పాటుపై అధికారులకు క్లారిటీ లేదు..
మజ్లిస్ ఒత్తిడితో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను మూడు ముక్కలు చేశారని రామచందర్రావు దుయ్యబట్టారు. హైదరాబాద్లో డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికీ అధికారులకు ఒక క్లారిటీ లేదని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలకు నీటి సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ప్రజాసమస్యలను కాంగ్రెస్ నేతలు పక్కదారి పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్కు మజ్లిస్ ముఖ్యం కానీ, హైదరాబాద్ ప్రజలు ముఖ్యం కాదని చెప్పుకొచ్చారు. భాగ్యనగరంలో కాలుష్య నియంత్రణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు.
రియల్ ఎస్టేట్ రంగం కుదేలు..
కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్ పేరుతో జేబులు నింపుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యిందని అన్నారు. భాగ్యనగరంలో చిన్న వాన పడితే.. నగరం మునిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా బీజేపీ మాత్రమే మార్చగలదని వ్యాఖ్యానించారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. తెలంగాణలో అవినీతి రహితమైన పరిపాలనను బీజేపీ మాత్రమే అందిస్తుందని రామచందర్రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కేంద్రం సహకరించకున్నా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం: సీఎం రేవంత్రెడ్డి
కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన విధానాలతో రైతాంగం కష్టాల్లో ఉన్నారు: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And International News And Telugu News