బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య.. సీఎంపై కిషన్రెడ్డి ధ్వజం
ABN , Publish Date - Mar 23 , 2026 | 03:48 PM
సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్భంధాలతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్భంధాలతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరని చెప్పుకొచ్చారు. ఈ మేరకు కిషన్రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు.
ప్రతిపక్షాలకు ఆ హక్కు లేదా..?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సహా సీనియర్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అభద్రతాభావానికి అద్దంపడుతోందని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజల సమస్యలపై ప్రభుత్వ తీరును నిరసించే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆగ్రహించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా..? లేక పోలీస్ బలగాలతో పాలిస్తున్నారా..? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగించాలనుకోవడం ప్రభుత్వ భ్రమ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అరెస్టులు, లాఠీచార్జీలతో ప్రజాసమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటాన్ని అణచివేయలేరని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
నేను ఇక కాంగ్రెస్లో ఉండలేను.. జీవన్రెడ్డి సంచలన ప్రకటన
బిల్డింగ్ రూల్స్లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
Read Latest Telangana News And AP News And International News And Telugu News