గోదావరి పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: డీజీపీ
ABN , Publish Date - Sep 12 , 2026 | 08:52 PM
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా శనివారం రాజమహేంద్రవరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు పటిష్ఠమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) ఈరోజు (శనివారం) రాజమహేంద్రవరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు పటిష్ఠమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని భౌగోళిక స్వరూపం, పుష్కరాల సమయంలో ఏర్పడే రద్దీ, ఘాట్లు, ట్రాఫిక్ పరిస్థితులు, పోలీస్ శాఖ చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లపై డీజీపీ చర్చించారు. 2027 ఫిబ్రవరిలోపు పోలీస్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ నిర్మాణాలు పూర్తయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని డీజీపీ దిశానిర్దేశం చేశారు.
కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి..
మల్టీపుల్ పుష్కర్ జాయింట్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేసి, అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని డీజీపీ సూచించారు. మైక్రో టీమ్స్ను ఏర్పాటు చేసి, వారికి అవసరమైన సాంకేతిక పరికరాలను అందజేసి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించేలా చూడాలని నిర్దేశించారు. ఆయా బృందాల పనితీరును నిరంతరం పరిశీలిస్తూ, వారానికి ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించారు. ఆయా పనుల పురోగతిని అంచనా వేసి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించాలని ఆదేశించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, ఫీల్డ్ సిబ్బంది ద్వారా రియల్ టైమ్ సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరేలా సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు.
జాయింట్ క్యాలెండర్ రూపొందించుకోవాలి..
ఈ పుష్కరాల సమయంలో స్థానికంగా నివసించే ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక ఏర్పాట్లు రూపొందించుకోవాలని డీజీపీ ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన పనులన్నీ నిర్ణీత గడువులో పూర్తయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో జాయింట్ క్యాలెండర్ రూపొందించుకోవాలని సూచించారు. సీనియర్ స్కూల్ విద్యార్థులతో పాటు ఇతర వలంటీర్ల సేవలను సమర్థవంతంగా వినియోగించుకుని భక్తులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు
గణేశ్ మండపాలకు 9 రోజుల ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News