2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ABN , Publish Date - Sep 11 , 2026 | 02:21 PM
స్వచ్ఛవాయు సర్వేక్షణ్లో గుంటూరుకు జాతీయ స్థాయిలో రెండో స్థానం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీస్గా గుంటూరు, విజయవాడలోని వార్డులకు అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛవాయు సర్వేక్షణ్లో గుంటూరుకు జాతీయ స్థాయిలో రెండో స్థానం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీస్గా గుంటూరు, విజయవాడలోని వార్డులకు అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈరోజు (శుక్రవారం) కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పురపాలక, విద్యా, వైద్య ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. రూ.1.05 కోట్ల నగదు ప్రోత్సాహంతోపాటు... జాతీయ స్థాయిలో ఐదు అవార్డులను ఈ ఏడాది ఏపీ దక్కించుకుందని వెల్లడించారు. గుంటూరు, ఏలూరు, విజయనగరం, విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు నగరాల్లో అత్యుత్తమ పని తీరు చూపించాయని చెప్పుకొచ్చారు. నైపుణ్యాభివృద్ధి విషయంలో యువతకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో గుర్తించాలని పేర్కొన్నారు.
జాబ్ ఫెయిర్లు నిర్వహించాలి..
ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు పరిశ్రమలను కూడా అనుసంధానించి.. అవసరమైన నైపుణ్యాలపై అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించటం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకూ విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని ఆదేశించారు. పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులతోనూ ఈ నైపుణ్యాలను కల్పించే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. ఏపీకి వచ్చే పరిశ్రమల్లో నైపుణ్యం ఉన్న మన యువతే ఉద్యోగాలు సాధించేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల వారీగా జాబ్ ఫెయిర్లు నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అవగాహన కల్పించాలని నిర్దేశించారు. ఇప్పటి వరకూ 4.98 లక్షల మంది యువత నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు.
నైపుణ్య కల్పనపై అవగాహన కల్పించాలి..
నైపుణ్య కల్పనపై ప్రజల్లో కూడా విస్తృత అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటే వారికి నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏపీలో పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో యువత ఉంటారని అన్నారు. 2027 నాటికి అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా వందశాతం అక్షరాస్యతను సాధించాలని దిశానిర్దేశం చేశారు. లిటరేట్ లెర్న్ డ్ స్టేట్గా ఏపీ మారాలని సూచించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పైనా విద్యార్థులు నైపుణ్యం సాధించేలా చూడాలని నిర్దేశించారు. స్కూల్ బిల్డింగ్ సేఫ్టీపై ఆడిటింగ్ నిర్వహించి వాటిని సురక్షితంగా మార్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ నెలా ఒక రోజు సంజీవని కార్యక్రమం ద్వారా వైద్య ఆరోగ్య పరిరక్షణపై క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
జగన్కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి: అయ్యన్నపాత్రుడు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోదావరి పుష్కరాలకు నిధుల మంజూరు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News