Share News

ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది.. కొల్లు రవీంద్ర ధ్వజం

ABN , Publish Date - Jun 13 , 2026 | 02:47 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధ హామీని తుంగలో తొక్కి, కల్తీ మద్యంతో 30 వేల మంది ప్రాణాలను గొడ్డలి పార్టీ బలితీసుకుందని ధ్వజమెత్తారు.

ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది.. కొల్లు రవీంద్ర ధ్వజం
AP Minister Kollu Ravindra

అమరావతి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధ హామీని తుంగలో తొక్కి, కల్తీ మద్యంతో 30 వేల మంది ప్రాణాలను గొడ్డలి పార్టీ బలితీసుకుందని ధ్వజమెత్తారు. ఈరోజు(శనివారం) అమరావతి వేదికగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. బాబాయి హంతకులను కాపాడుతూ, న్యాయం కోరిన సొంత చెల్లికే జగన్ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహించారు. విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచి, ప్రజలపై రూ.32 వేల కోట్ల మోయలేని భారం మోపారని దుయ్యబట్టారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ హామీలను అటకెక్కించి ఐదేళ్లలో 4,100 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు.


12 లక్షల మంది భవితను అంధకారం చేశారు..

జీఓ నంబర్ - 117 తీసుకువచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రభుత్వ స్కూళ్లను మూసివేసి, 12 లక్షల మంది భవితను అంధకారం చేశారని దుయ్యబట్టారు. బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34శాతం నుంచి 24శాతానికి కుదించి వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిన ఘనత జగన్‌దేనని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని ఆగ్రహించారు. 2024 ఎన్నికల్లో 94 శాతం స్థానాలతో కూటమికి చరిత్రాత్మక విజయం అందించి.. జగన్ అరాచక పాలనకు ఏపీ ప్రజలు స్వస్తి పలికారని ప్రస్తావించారు. గత ఐదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తూ.. రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమం, ప్రగతి పథంలో ప్రయాణిస్తోందని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వ సానుకూల విధానాల వల్ల, రెండేళ్లలో దేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే దక్కాయని వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. రెండేళ్లలో తమ ప్రభుత్వంలో రూ. 65 వేల కోట్లని నేరుగా పేదలకు పంపిణీ చేశామని వెల్లడించారు.


21 లక్షల ఉద్యోగాలని కల్పిస్తాం..

కూటమి ప్రభుత్వ తొలి సంతకంతో మెగా డీఎస్సీ ఫైలుపై ఆమోదం పొందిన తర్వాత.. 16,430 ఉపాధ్యాయ, 6,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేశామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మెగా డీఎస్సీపై గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం (స్త్రీ శక్తి) ద్వారా ఇప్పటివరకు 71 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని వెల్లడించారు. దీపం-2 పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ.. ఇప్పటివరకు 4.26 కోట్ల సిలిండర్లను విజయవంతంగా అందజేశామని అన్నారు. 24 నెలల స్వల్ప వ్యవధిలోనే రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వివరించారు. 21 లక్షల ఉద్యోగాల కల్పనకు పక్కా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. జగన్ హయాంలో 85శాతం హామీలను తుంగలో తొక్కితే.. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే 90శాతం సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చిందని ఉద్ఘాటించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. గొడ్డలిపార్టీ దొంగనాటకాలు ఆడుతూ మరొకసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీతో విద్యార్థులకు భవిష్యత్తు నైపుణ్యాలు: సీఎం చంద్రబాబు

డీఎస్సీపై అపోహలు వద్దు.. అక్టోబర్‌లో మరో నోటిఫికేషన్: ఏపీ విద్యాశాఖ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 03:01 PM