సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 07 , 2026 | 10:12 AM
సమర్థ నాయకత్వంతోనే సమస్యలను పరిష్కరించవచ్చని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. లీడర్షిప్ కాంక్లేవ్ను తొలిసారిగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): సమర్థ నాయకత్వంతోనే సమస్యలను పరిష్కరించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. లీడర్షిప్ కాంక్లేవ్ను తొలిసారిగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నాయకత్వం అంటేనే తెలుగుదేశం అని అభివర్ణించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వర్క్షాప్ను సీఎం చంద్రబాబు ఈరోజు (సోమవారం) ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఎన్నో సమస్యలను తాను పరిష్కరించానని... ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. కానీ నీటి సమస్యలకు పరిష్కరించినప్పుడే తనకు అత్యంత సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు.
భవిష్యత్తును అంచనా వేయాలి..
వర్తమానాన్ని అర్థం చేసుకోవాలని... భవిష్యత్తును అంచనా వేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. చెడు గురించి చెబితేనే మంచి అంటే ఏంటో తెలుస్తుందని తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏపీని వెంటిలేటర్పై పెట్టిందని ధ్వజమెత్తారు. వ్యవస్థలను విధ్వంసం చేశారని ఆగ్రహించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కలిసి కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. ఎప్పుడూ దక్కని విజయాన్ని ప్రజలు కూటమికి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కట్టబెట్టారని ప్రస్తావించారు. పాలకుడు ఏ విధంగా ఉండకూడదనే దానికి గత పాలకుడే ఓ కేస్ స్టడీ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తాము ఇచ్చిన హామీల అమలుకు అనునిత్యం పనిచేస్తున్నామని వెల్లడించారు. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ పాలన చేపట్టామని వివరించారు. స్వర్ణాంధ్ర విజన్-2047కు రూపకల్పన చేశామని తెలిపారు. జిల్లా, నియోజకవర్గాలకూ విజన్ ప్లాన్ ఇచ్చామని చెప్పుకొచ్చారు. నెలకు నాలుగు రోజులు తక్కువ కాకుండా క్షేత్రస్థాయిలో ఉంటున్నానని తెలిపారు. పేదల సేవలో, మీ భూమి-మీ హక్కు, స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర, సంజీవని కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నానని ప్రస్తావించారు. విద్య-వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఉద్ఘాటించారు. ప్రైవేట్ స్కూళ్లకు విద్యార్థులు గుడ్ బై చెప్పి ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారని తెలిపారు. 63 లక్షల మందికి రూ.73 వేల కోట్ల మేర ఫించన్ ఇప్పటికే పంపిణీ చేశామని వెల్లడించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు, ఆటోడ్రైవర్ల సేవలో, నేతన్నల సేవలో, దీపం, మత్స్యకారుల సేవలో వంటి చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు..
మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ చేశామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ఒక్క డీఎస్సీ కూడా పెట్టని వ్యక్తి మనపై విమర్శలు చేస్తున్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. పోలవరం, అమరావతి నిర్ధిష్ట సమయంలో పూర్తి చేస్తాం. 28 కొత్త పాలసీలతో పెట్టుబడులు తీసుకువస్తున్నాం... పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించి ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఇచ్చాం. ఉత్తరాంధ్ర ఇకపై వెనుకబడిన ప్రాంతం కాదు... అభివృద్ధికి కేంద్రం. గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు, ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు వచ్చాయి. అమరావతిని క్వాంటం నాలెడ్జ్ హబ్గా మారుస్తున్నాం. పోర్టులు నిర్మిస్తున్నాం.. మౌలిక వసతులు కల్పిస్తున్నాం. రాయలసీమ రైజింగ్ నినాదంతో గోల్డ్ ఫీల్డ్, ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్ వంటివి తీసుకువచ్చాం. రాయలసీమ ప్రాంతాన్ని హర్టీకల్చర్ హబ్గా చేస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా కొత్త ఆవిష్కరణలను, పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహిస్తున్నాం. పరిపాలనలో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చాం. 1100 సేవలను వాట్సాప్ ద్వారా ఆన్లైన్ సేవలు అందిస్తున్నాం. రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నాం. క్యూఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీతో భూములకు భద్రత కల్పిస్తున్నాం. వందేళ్లకు పైగా ఉన్న భూముల వివాదాన్ని పరిష్కరిస్తున్నాం. 22ఏ భూములకు మోక్షం చూపుతున్నాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరిస్తే ప్రజాప్రతినిధులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ నాయకత్వానికి కొత్త దిశ.. చంద్రబాబు- లోకేశ్ సమక్షంలో లీడర్షిప్ కాంక్లేవ్
పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ.. ఉప్పాడ తీర రక్షణకు కీలక చర్యలు
వంగవీటి రాధాను పాస్పోర్ట్ వ్యవహారంలో మోసం చేసేందుకు బ్రోకర్ యత్నం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News