టీటీడీ నెయ్యి టెండర్లో అక్రమాలు.. పయ్యావుల షాకింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:37 PM
శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి లడ్డూ గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు..
అమరావతి, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ (AP Finance Minister Pyyavula Keshav) స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి లడ్డూ గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు గతంలో తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అనంతరం పయ్యావుల మీడియాతో మాట్లాడారు. అప్పటి ఈవో ధర్మారెడ్డికి పోటు కార్మికులు చెపితే.. ఆర్గానిక్ నెయ్యి అలానే ఉంటుందని చెప్పారని ప్రస్తావించారు. ఈవో తన విధి నిర్వహణలో భాగంగా NDDBకి శాంపిల్స్ పంపారని గుర్తు చేశారు. NDDB రిపోర్టుతో అందరు నివ్వెరపోయారన్నారు. S వ్యాల్యూలో తేడాతో కల్తీ జరిగినట్లుగా నివేదిక వచ్చిందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
సీఎఫ్టీఆర్ఐ మరో నివేదిక..
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ విషయాలను ప్రజల ముందు పెట్టారని, నాటి రిపోర్టును వివరించారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కల్తీ వ్యవహరాన్ని తేల్చడానికి సిట్ను ఏర్పాటు చేశాం. దీనిలో మరో ఇద్దరు అధికారులను యాడ్ చేసి సీబీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. టీటీడీలో ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కటీ తెలిసే జరిగింది. తెలియక కాదు... సీఎఫ్టీఆర్ఐ కూడా మరో నివేదిక ఇచ్చింది. బెటాసిస్టో స్టిరాయ్ దీనిలో ఉన్నట్లు పేర్కొంది. ఇంత తెలిసిన తర్వాత కూడా టీటీడీ మాజీ చైర్మన్ ఈ విషయాన్ని తొక్కిపెట్టారు. 60 లక్షల లీటర్లు కల్తీ నెయ్యి సరఫరా చేశారు, రూ.234 కోట్లు దుర్వినియోగమైంది’ అని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టారు..
చిన్న అప్పన్న బోలేబాబా డెయిరీ దగ్గరకు వెళ్లి ఈ టెండర్ ఇవ్వాలని కోరారని.. వారు అంగీకరించలేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ‘వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. తర్వాత కూడా వారి సంస్థను తీసుకోవడం కుదరదని.. ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీల ద్వారా సరఫరా చేయించారు. కిలోకు రూ.35లు నష్టానికి వారు సరఫరా చేశారు. ఇది వారికి ఎలా సాధ్యమైందో ఆలోచించాలి. రూ.320లకు నెయ్యి ఎలా ఇచ్చారు... బోలే బాబా అనే సంస్థ నెయ్యి అని పిలువబడే నెయ్యిని తయారు చేశారు. ఫామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ను నెయ్యి వాసన వచ్చేలా, రంగువచ్చేలా తయారు చేశారు. బోలేబాబాలో పదిమంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వీరిలో స్వీపర్లు, వాచ్మెన్లు కాకుండా ఆరుగురు ఉన్నారు’ అని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..
రాజమండ్రిలో పెద్ద పులి భయం.. ఫారెస్ట్ బృందం చర్యలు
Read Latest Telangana News And AP News And Telugu News