అలర్ట్.. బోనాల సందర్భంగా భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 07:14 PM
హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు ఆగస్టు 9, 10 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు ఆగస్టు 9, 10 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. లాల్ దర్వాజా, కార్వాన్ దర్బార్ మైసమ్మ, అంబర్పేట్ మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. లాల్ దర్వాజా బోనాల నేపథ్యంలో పాతబస్తీలో ఆగస్టు 9వ తేదీన ఉదయం 6 గంటల నుంచి, 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు.
మదీనా ఎక్స్ రోడ్డు నుంచి ఇంజిన్ బౌలి (చార్మినార్, నాగుల్ చింతా మీదుగా) రహదారి బోనాల ఊరేగింపు పూర్తయ్యే వరకు పూర్తిస్థాయిలో ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వివరించారు. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలకు చార్మినార్, ఫలక్నుమా వైపు నో ఎంట్రీ ఉంటుందని తెలిపారు. వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించినట్లు వెల్లడించారు. కార్వాన్ దర్బార్ మైసమ్మ బోనాల సందర్భంగా ఆగస్టు 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 10వ తేదీ ఉదయం వరకు పురానాపూల్, జియాగూడ, టప్పాచబుత్రా పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు.
అంబర్పేట్ మహంకాళి ఆలయం వద్ద ఆగస్టు 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 10వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బస్సులు, భారీ వాహనాలు అంబర్పేట్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలని సూచించారు. చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయం వద్ద ఆగస్టు 9, 10వ తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. సీతాఫల్మండి, పద్మారావు నగర్ వైపు వాహనాలను మళ్లిస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
వార్తలు కూడా చదవండి...
సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు
జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు
క్షుద్ర పూజల విషయంలో హరీశ్రావు వివరణ ఇవ్వాలి: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News