Share News

తెలంగాణలో అగమ్యగోచరంగా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి: హరీశ్‌రావు

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:53 AM

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

తెలంగాణలో అగమ్యగోచరంగా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి: హరీశ్‌రావు
Harish Rao

హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన గైనకాలజీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, పీడియాట్రిక్‌ తదితర ప్రత్యేక వైద్య సేవలను అందించే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పరిస్థితి కమిషనర్ లేక గాలిలో దీపంలా మారడం శోచనీయమని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హరీశ్‌రావు పోస్టుపెట్టారు. గత రెండు నెలలుగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో TVVP పరిధిలోని ఎంసీహెచ్, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీ మొత్తంగా 184 ఆస్పత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.


అధికార యంత్రాంగమే లేకుండా పోయింది..

ఆస్పత్రుల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వైద్యుల హాజరు, ల్యాబ్ పరీక్షలు, మందుల లభ్యత తదితర అంశాలను పర్యవేక్షించే అధికార యంత్రాంగమే లేకుండా పోయిందని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. దీంతో ఒకవైపు వైద్యులు, వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పాలనలో ప్రజలు సరైన వైద్య సేవలు అందక అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది వేతనాలు, సర్వీస్‌ సమస్యలు సహా ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో TVVPని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయాలని తమ హయాంలో నిర్ణయించామని ప్రస్తావించారు.


వైద్య సిబ్బంది తీవ్ర నిరాశకు గురవుతున్నారు..

దాదాపు మూడేళ్లు గడుస్తున్నా సర్వీసు నిబంధనలు రూపొందించక పోవడం, లక్ష్యం కార్యరూపం దాల్చకపోవడం దురదృష్టకరమని హరీశ్‌రావు అన్నారు. దీంతో వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్ర నిరాశకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. ఇదే విషయమై ఉద్యోగులు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకుండా పోతుందని తెలిపారు. రోడ్లెక్కి నిరసనలు తెలియచేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమస్యలతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడాలని డిమాండ్ చేశారు. వెంటనే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు సంబంధించి వెంటనే కమిటీ వేసి సర్వీస్ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని, తక్షణమే పూర్తిస్థాయి అధికారిని నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.


వార్తలు కూడా చదవండి...

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి

ఆ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి మోసం చేశారు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 04 , 2026 | 12:16 PM