ఏపీ, తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:46 AM
మచిలీపట్నం, ములుగు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం సృష్టించాయి. న్యాయమూర్తులు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు రాగా, పోలీసులు బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు.
మచిలీపట్నం, ములుగు,, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రెండు కీలకమైన కోర్టులకు ఈరోజు(సోమవారం) బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం సృష్టించింది. మచిలీపట్నం (బందర్), తెలంగాణలోని ములుగు జిల్లా కోర్టులను లక్ష్యంగా చేసుకుని అజ్ఞాత వ్యక్తులు పంపిన ఈమెయిల్స్ న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులను భయాందోళనకు గురిచేశాయి.
మచిలీపట్నం, ములుగులో హై అలర్ట్
ఒకే తరహాలో ఈమెయిల్స్ రావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో తెలంగాణ, ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడం సంచలనం సృష్టించింది. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అజ్ఞాత వ్యక్తి నుంచి బాంబు ఉందనే మెయిల్ రావడంతో ఒక్కసారిగా అంతా అప్రమత్తమయ్యారు. ప్రాణహాని ఉంటుందనే భయంతో న్యాయమూర్తులందరూ తమ గదులను వదిలి బయటకు వచ్చారు. వీరంతా కోర్టు ఆవరణలోని ఆరుబయట కుర్చీల్లో కూర్చుని పరిస్థితిని గమనించారు.
క్లూస్ టీమ్ తనిఖీలు..
సమాచారం అందిన వెంటనే పోలీసులు, క్లూస్ టీమ్ కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ములుగు జిల్లా కోర్టుకు సైతం బెదిరింపు
తెలంగాణలోని ములుగు జిల్లా కోర్టుకు కూడా అదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబు పెట్టినట్లు ఈమెయిల్ రావడంతో సిబ్బంది, లాయర్లు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి.
బాంబ్ స్క్వాడ్ రంగ ప్రవేశం..
ములుగు పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో కోర్టు హాల్స్, రికార్డు రూమ్లను అణువణువు తనిఖీ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
నేను ఇక కాంగ్రెస్లో ఉండలేను.. జీవన్రెడ్డి సంచలన ప్రకటన
బిల్డింగ్ రూల్స్లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
Read Latest Telangana News And AP News And International News And Telugu News