జగన్ అండ్ కో అసెంబ్లీలో మాట్లాడాలి.... పారిపోకూడదు.. మాధవ్ సెటైర్లు
ABN , Publish Date - Aug 16 , 2026 | 02:51 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (BJP AP president Madhav) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (ఆదివారం) విశాఖపట్నంలో మాధవ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. అసెంబ్లీకి జగన్ రెడ్డి రావాలని ఆహ్వానించారు. ప్రజా సమస్యలపై జగన్ అండ్ కో అసెంబ్లీలో మాట్లాడాలని.... పారిపోకూడదని పేర్కొన్నారు.
18న విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారని మాధవ్ తెలిపారు. రేపు (సోమవారం) భోగాపురం ఎయిర్పోర్టుకు ఆయన చేరుకుంటారని అన్నారు. విమానాశ్రయం ప్రారంభమైన తరుణంలో తమ జాతీయ అధ్యక్షుడు ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారి విశాఖకు వస్తున్నారని తెలిపారు.నితిన్ నబీన్కి ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 18వ తేదీన విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. ఏపీలో పార్టీ సంస్థాగత నిర్మాణ, రాష్ట్ర ప్రగతిపై ఈ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో మోదీ చొరవతో పాటు ఏపీలో అభివృద్ధి, నీటి పారుదల ప్రాజెక్ట్లపై తీర్మానాలు ఉంటాయని చెప్పారు.
విశాఖపట్నం వేదికగా ఆర్ఎస్ఎస్ సమావేశాలు..
విశాఖపట్నం వేదికగా ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరుగుతాయని మాధవ్ వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మోదీ మనస్సులో ఏపీ ఉందని, ఏపీ ప్రజల్లో మోదీ ఉన్నారని ప్రస్తావించారు. మరి కొద్ది రోజుల్లో విశాఖకు గోదావరి జలాలు వస్తాయని వెల్లడించారు. గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కు వచ్చిందని తెలిపారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. త్వరలో కొత్త రైల్వేస్టేషన్, కొత్త రైళ్లు వస్తున్నాయని వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించామని అన్నారు. స్థానిక సంస్థలకు కూటమి పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళ్తాయన్నారు. విశాఖ ఎయిర్పోర్టు శకం ముగిసిపోవడంతో కొంత బాధగా ఉందని చెప్పారు. విశాఖపట్నం ప్రజలకు ఈ విమానాశ్రయానికి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు.
ఈ ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతోంది..
భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతోందని మాధవ్ ఉద్ఘాటించారు. ఒక లక్షమందికి ఎయిర్పోర్టులో ఉపాధి లభించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని చెప్పుకొచ్చారు. డేటా సెంటర్లతో తలెత్తే సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు దృష్టి సారించాయని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు గత ఆరు నెలలుగా లాభాల బాటలో నడుస్తోందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు రివైవల్ ప్యాకేజీ ఇచ్చామని మాధవ్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని
‘నిబంధనల ప్రకారమే జగన్ను ములాఖత్కు అనుమతించాం’
తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News