ప్రతిపక్షంలో ఉండాల్సిన వైసీపీ అసెంబ్లీకి ఎందుకెళ్లట్లేదు: రఘువీరారెడ్డి
ABN , Publish Date - Aug 16 , 2026 | 01:26 PM
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లాలని, సభకు వెళ్లకపోవడం సరికాదని సీడబ్య్లూసీ సభ్యులు, మాజీమంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
కర్నూలు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వెళ్లాలని, సభకు వెళ్లకపోవడం సరికాదని సీడబ్య్లూసీ సభ్యులు, మాజీమంత్రి రఘువీరారెడ్డి (Raghuveera Reddy) పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని కిసాన్ ఘాట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతిని ఈరోజు (ఆదివారం) నిర్వహించారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డికి రఘువీరారెడ్డి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడారు. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని.. ఎల్నినోపై చర్చించాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉండాల్సిన వైసీపీ అసెంబ్లీకి ఎందుకెళ్లట్లేదని ప్రశ్నించారు.
ఎల్నినోపై అసెంబ్లీలో చర్చించాలి..
ఏపీలో జగన్ ఐదేళ్లు పాలన చేశారని.. అసెంబ్లీకి వెళ్లి ఎల్నినోపై సలహాలు ఇవ్వొచ్చు కదా అని రఘువీరారెడ్డి నిలదీశారు. ఎల్నినో వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సభలో కీలక నిర్ణయాలు తీసుకుని కేంద్రప్రభుత్వ సహకారంతో రైతులను ఆదుకోవాలని కోరారు. మేధో నక్సల్స్ అన్న మాటను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టులో వెంటనే విద్యుత్ ఉత్పత్తి నిలిపి వేయాలి..
శ్రీశైలం ప్రాజెక్టులో వెంటనే విద్యుత్ ఉత్పత్తి నిలిపి వేయాలని రఘువీరారెడ్డి కోరారు. ఎందుకంటే ఎగువ నుంచి వరద రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తే.. జలవివాదాలు తలెత్తవని అన్నారు. ఎల్నినో గండం నుంచి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రఘువీరారెడ్డి సూచించారు.
వార్తలు కూడా చదవండి...
దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని
‘నిబంధనల ప్రకారమే జగన్ను ములాఖత్కు అనుమతించాం’
తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News