Share News

గొడ్డలి పార్టీ ఆగడాలు శృతి మించితే వదిలిపెట్టం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Jun 06 , 2026 | 03:05 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి గొడ్డలి పార్టీ చేతులెత్తేసిందని విమర్శించారు.

గొడ్డలి పార్టీ ఆగడాలు శృతి మించితే వదిలిపెట్టం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
AP CM Chandra babu Naidu

అమరావతి, జూన్6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి గొడ్డలి పార్టీ చేతులెత్తేసిందని విమర్శించారు. వైసీపీ హయాంలో సీపీఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి ఎందుకు పక్కన పెట్టేసిందని ప్రశ్నించారు. ఈరోజు (శనివారం) మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై దిశినిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని గొడ్డలి పార్టీ మాట తప్పిందని ధ్వజమెత్తారు. ఇంతటితో ఆగకుండా వ్యవస్థలను విధ్వంసం చేసిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో చెప్పినవి చేయకపోగా తమ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025పై బురద జల్లారని ఆగ్రహించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఎలా దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారో... డీఎస్సీ విషయంలోనూ దుష్ప్రచారంతో లబ్ధిపొందాలనుకున్నారని దుయ్యబట్టారు.


ఆధారాలతో సహా జగన్ అండ్ కోకు కౌంటర్ ఇచ్చాం..

డీఎస్సీ నిర్వహణపై ఆధారాలతో సహా జగన్ అండ్ కోకు కౌంటర్ ఇచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్‌తో గొడ్డలి పార్టీ నేతలు డిఫెన్సులో పడ్డారని చెప్పుకొచ్చారు. దుష్ప్రచారం చేయడం, ఫేక్ రాజకీయాలు చేయడం గొడ్డలి పార్టీ విధానం, సిద్ధాంతమని విమర్శించారు. అధికారంలో ఉన్నామని... సహనం, ఓపిక అవసరమని.. కానీ గొడ్డలి పార్టీ ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టమని హెచ్చరించారు. మంచి ఆలోచనలు చేసే వాళ్లకు మంచి వాళ్లే సహయపడతారని అన్నారు. చెడు ఆలోచనలు చేసే వాళ్ల చుట్టూ గొడ్డలి బ్యాచ్ జమ అవుతుందని ఎద్దేవా చేశారు. ఇకపై టీడీపీకి ఓటమి లేదని, రాదని తెలిపారు. ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలతో మంచిగా ఉంటున్నామని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నామని.. సంక్షేమ పథకాలు - అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నామని.. అందుకే టీడీపీకి ఓటమి రాదని పేర్కొన్నారు. పార్టీ పదవులు మొదలుకుని టికెట్ల కేటాయింపుల వరకు నిరంతరం సర్వేలు చేయిస్తున్నామని తెలిపారు.


లోకేశ్ చక్కగా పని చేస్తున్నారు..

ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రం, పార్టీ శ్రేయస్సు కోసం తప్పులు చేసిన వాళ్లని వదిలించుకుంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఏం ప్రచారం చేశారో... అవన్నీ తమ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని గడప గడపకు వెళ్లి చెప్పాలని దిశానిర్దేశం చేశారు. ఆనాడు చెప్పిన వాటిని ఈనాడు నెరవేరుస్తున్నామనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలని అన్నారు. మంగళగిరిలో టీడీపీ గెలిచి చాలా కాలమైందని... 2019 ఎన్నికల్లో నారా లోకేశ్ పోటీ చేసినా ఓడిపోయారని ప్రస్తావించారు. ఆ తర్వాత పట్టుపట్టి పనిచేశారని.. 2024లో అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు. గెలిచిన తర్వాత కూడా మంగళగిరిలో లోకేశ్ చక్కగా పని చేస్తున్నారని.. ఇప్పుడు మంగళగిరి టీడీపీకి కంచుకోటగా మారిందని చెప్పుకొచ్చారు. యుద్ధాన్ని గెలిపించే బాధ్యత తనదని... తనతో పాటు అలుపెరగకుండా యుద్ధం చేసే బాధ్యత టీడీపీ శ్రేణులదని తెలిపారు.


కార్యకర్తలకు అన్నిరకాలుగా అండగా ఉంటాం..

రాష్ట్రంలోని ప్రతి కేంద్రంలోనూ గతానికి మించి ఓట్లు రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ పరంగా చేయాల్సిందంతా చేస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని... ప్రభుత్వం చేసే అభివృద్ధిని అందిపుచ్చుకునేలా కార్యకర్తలు ఆలోచించాలని అన్నారు. భవిష్యత్తు రాజకీయాలకు కూటమితోనే వెళ్తున్నామని.. వెళ్తామని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల ముందు బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా ఓట్లు చీలకూడదనే.. టీడీపీతో కలుస్తానని పవన్ కల్యాణ్ చెప్పారని అన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా వెళ్లడంతోనే 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో గెలిచామని ప్రస్తావించారు. పార్టీ అగ్రనేతలు మొదలుకుని... కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ బ్రాండ్ మైండ్‌తో ఆలోచించాలని సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest AP News And Telangana News  And National News

And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 03:30 PM