టీచర్గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:14 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పోలవరం జిల్లా రంపచోడవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హైస్కూలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, వారి తల్లితండ్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
పోలవరం జిల్లా , జులై 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (శుక్రవారం) పోలవరం జిల్లా రంపచోడవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హైస్కూలు - జూనియర్ కళాశాలలో విద్యార్థులు, వారి తల్లితండ్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రోగ్రెస్ రిపోర్టులను పరిశీలించిన సీఎం..
ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై విద్యార్థులకు సీఎం దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల చదువు పురోగతి, ప్రోగ్రెస్ రిపోర్టులను సీఎం పరిశీలించారు. విద్యార్థులు సాధించిన మార్కులు, హాజరు శాతం, ఆరోగ్యం తదితర వివరాలను తల్లిదండ్రులకు వివరించారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల రిపోర్టులను తల్లిదండ్రులు పరిశీలించేలా వారి ఇళ్లకే పంపించాలని జిల్లా కలెక్టర్కు సీఎం ఆదేశాలిచ్చారు. మరో తరగతి గదిలోని స్మార్ట్ బోర్డు ద్వారా పాఠ్యాంశాలను బోధించే విధానాన్ని పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో కాసేపు టీచర్గా మారి విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పాఠాలు చెప్పారు.
పచ్చదనాన్ని పెంచటంలో విద్యార్థులంతా కలిసి కృషి చేయాలి..
అంతకుముందు, ప్రభుత్వ హైస్కూలు ప్రాంగణంలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్న విద్యార్థులను, వారికి ఇచ్చిన గ్రీన్ పాస్ పోర్టును సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులను అభినందించారు. మొక్కకు తగిలించి ఉన్న టాక్పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దాని వివరాలను తెలుసుకునేలా చర్యలు చేపట్టినట్లుగా అధికారులు వివరించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచటంలో విద్యార్థులంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ఫొటోఫ్రేమ్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫొటో దిగారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి సమావేశంలో సీఎం మాట్లాడారు.
తల్లికి వందనం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి..
అలాగే, రంపచోడవరంలోని ప్రభుత్వ హైస్కూల్ – జూనియర్ కాలేజీ ప్రాంగణంలోని సరస్వతి దేవి, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పూలమాలలు వేశారు. తల్లికి వందనం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. తల్లికి వందనం నిధులు జమ అయ్యాయా అంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. తమకు ఈ పథకం నిధులు జమ అయ్యాయంటూ తమ ఫోన్లకు వచ్చిన మెసేజ్లను తల్లులు సీఎంకు చూపించారు. తల్లికి వందనం నిధులను సద్వినియోగం చేసుకోవాలని లబ్దిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: మంత్రి ఆనం
అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు వస్తున్నాయి: మంత్రి గొట్టిపాటి
భూమన ఆక్రమించిన భూముల స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం చర్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News