తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు
ABN , Publish Date - Jun 01 , 2026 | 10:07 AM
తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుమల, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఈరోజు (సోమవారం) ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకి వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. జీవితంలో ముఖ్యమైన రోజున శ్రీవారి సన్నిధిలో గడపడం ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, తన భవిష్యత్తు కార్యాచరణపై అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. తన వయస్సు పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో తన కుటుంబ సభ్యులకు కూడా రాజకీయంగా, పార్టీలో సేవ చేసే అవకాశం కల్పించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజాసేవలో తన కుటుంబం కూడా భాగస్వామ్యం కావాలని అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు.
శ్రీవారిని దర్శించుకున్న నారాయణస్వామి..
అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!
యువ క్రీడాకారులకు స్ఫూర్తి సాత్విక్-చిరాగ్: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News