పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత
ABN , Publish Date - May 31 , 2026 | 02:38 PM
విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి జరగడం దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. హోంగార్డ్ వెంకటరమణపై కొంతమంది కత్తితో దాడి చేశారని పేర్కొన్నారు.
విశాఖపట్నం, మే31 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి జరగడం దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. హోంగార్డ్ వెంకటరమణపై కొంతమంది కత్తితో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో వెంకటరమణకు గాయాలయ్యాయని చెప్పుకొచ్చారు. షీలానగర్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డును.. హోంమంత్రి అనిత ఈరోజు (ఆదివారం) పరామర్శించారు. లంకెలపాలెం వద్ద విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై కొంతమంది దాడి చేశారు.

ఈ ఘటనలో హోంగార్డు వెంకటరమణకు గాయాలయ్యాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి అనిత తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. వెంకటరమణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. తక్షణమే పోలీసులు స్పందించి ఆస్పత్రిలో ఆయనను చేర్పించారని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో వెంకటరమణ చికిత్స పొందుతున్నారని అన్నారు.

ఈ ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశామని.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అనిత చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. అనునిత్యం పోలీసులు ఎంతో కష్టపడి విధులు నిర్వహిస్తున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
