Madhav Counter on Jagan: ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు.. జగన్ అండ్ కోపై మాధవ్ ఫైర్
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:33 PM
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
విశాఖపట్నం, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి): గత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) వ్యవహారించారని ధ్వజమెత్తారు. వైసీపీ (YSRCP) ప్రభుత్వం మైనార్టీల నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. ఇవాళ(శనివారం) విశాఖపట్నంలో పీవీఎన్ మాధవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాధవ్ మాట్లాడారు. విశాఖలో సారథ్యం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని... ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. విశాఖలోని రైల్వే మైదాన వేదికలో ఈ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు పీవీఎన్ మాధవ్.
సారథ్యం యాత్రకు విశేష స్పందన..
సారథ్యం యాత్ర బహిరంగ సభలో బీజేపీలోని (BJP) ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేస్తున్నామని వివరించారు. కడప నుంచి సారథ్యం యాత్ర ప్రారంభించామని గుర్తుచేశారు. సారథ్యం యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని స్ఫూర్తిగా తీసుకుని బీజేపీలోని ప్రతి కార్యకర్త పని చేయాలనే విధంగా సారథ్యం యాత్ర చేపట్టామని వెల్లడించారు. సారథ్యం యాత్రలో వైతాలికులను గుర్తించి వారిని స్మరించుకున్నామని తెలిపారు. సారథ్యం యాత్రలో చాయ్ పై చర్చ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు పీవీఎన్ మాధవ్.
స్టీల్ ప్లాంట్పై అపోహలు..
‘కేంద్ర ప్రభుత్వ (Central Govt) పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయి. అక్టోబర్ 2తేదీన ఏపీవ్యాప్తంగా ఖాదీ సంతలను నిర్వహిస్తాం. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సాహసోపేతమైన నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అనేక రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నంలో పర్యటిస్తారు. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంతో పురోభివృద్ధి చెందుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్పై వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్డీఏ సారథ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రైవేటీకరణను ఒక భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటీకరణ అనేది అన్ని దేశాల్లోనూ జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని మొదట కోరింది బీజేపీనే. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదు’ అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీలో అమానుషం.. బీ ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్య
ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు
Read Latest Andhra Pradesh News and National News