Pulivendula ZPTC BY Election: నువ్వా నేనా.. పులివెందులలో టీడీపీ VS వైసీపీ వార్
ABN , Publish Date - Aug 11 , 2025 | 07:38 AM
మ్మడి కడప జిల్లాలోని రెండుచోట్ల జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఆదివారం సాయంత్రానికి ప్రచార సమయం ముగియడంతో అంతా గప్చుప్గా మారింది. పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి హేమంత్రెడ్డి బరిలో ఉన్నారు.
» జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం పరిసమాప్తం
» రేపే ఎన్నిక
» 1400 మందితో భద్రత
» పులివెందులలో ఓటుకు రూ.5 వేలు
» ఒంటిమిట్టలో రూ.3 వేలు
కడప జిల్లాలో మినీ సంగ్రామాన్ని తలపించే విధంగా జరిగిన పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం (ZPTC BY Election Campaigning) ఆదివారం సాయంత్రం 5గంటలకు పరిసమాప్తమైంది. ఎన్నికల నామినేషన్లు ఉపసంహరణ నుంచి కూటమికి సంబంధించి మంత్రులు సవిత, రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్ధనరెడ్డి, ఫరూక్, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక కలెక్టరు, డాక్టర్ చెరుకూరి శ్రీధర్ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 1400 మంది పోలీసులను నియమించారు. డీఐజీ కోయప్రవీణ్ ఆధ్వర్యంలో కడప ఎస్పీ అశోక్ కుమార్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
(కడప-ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కడప జిల్లాలోని రెండుచోట్ల జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఆదివారం సాయంత్రానికి ప్రచార సమయం ముగియడంతో అంతా గప్చుప్గా మారింది. పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి హేమంత్రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ 10,600 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఇక్కడ 11 మంది పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఓ విధంగా చెప్పాలంటే వైసీపీకి డూ ఆర్ డైగా మారింది. ఇక టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది.
టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డిలు భుజాన వేసుకున్నారు. వీరికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత, మంత్రి కొలుసు పార్థసారథి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు ఆర్.మాధవి, పుత్తా చైతన్యరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, బండారు శ్రావణి, భూపేశ్రెడ్డి, ఎంఎస్ రాజు, ఇతర టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక మాజీ సీఎం జగన్ ఆదేశాలతో వ్యూహరచనతో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం పాటుపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కడప మేయర్ సురేశ్ బాబు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఈ రెండు ఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో కలకలం రేపాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా రోజుల తర్వాత మొదటిసారిగా జనం ఓటు వేయబోతున్నారు.
ఒంటిమిట్టలో నువ్వా నేనా
ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ఉప ఎన్నిక కోసం అద్దలూరు ముద్దుక్రిష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలు పోటీ చేస్తున్నారు. మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్ధనరెడ్డి, ఫరూక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహనరాజు, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు ఇతర నేతలు టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించారు. మంత్రులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు లోకల్గానే ఒంటిమిట్టలోనే తిష్ఠ వేసి ముద్దుక్రిష్ణారెడ్డి గెలుపు కోసం వ్యూహాలు అమలు పరుస్తున్నారు. ఒంటిమిట్టలో శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక వైసీపీ తరపున ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, కడప మేయరు సురేశ్ బాబు, గోవిందరెడ్డితో సహా ఇతర అన్నమయ్య జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇక్కడ మొత్తం 13 పంచాయతీలు, 24,600 ఓట్లు ఉన్నాయి. 11 మంది బరిలో ఉన్నారు.
ఓటుకు రేటు
జడ్పీటీసీ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఆదేస్థాయిలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాయి. పులివెందులలో గెలుపును వైసీసీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఓటుకు రూ.5 వేలు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. టీడీపీ కూడా అదే స్థాయిలో ఓటుకు నోటు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక్కడ 10,600 ఓట్లు ఉన్నాయి. అంటే ఒక్కో ఓటుకు ఇరుపార్టీలు కలిసి రూ.10వేలు ఇస్తున్నారు. ఆదివారం రాత్రికే మొత్తం పంపిణీ పూర్తయినట్లు చెబుతున్నారు. ఇక ఒంటిమిట్టలో రూ.3వేలు వంతున పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో వైసీపీ రూ.4వేలు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి పులివెందుల, ఒంటిమిట్టలో సుమారు రూ.25 కోట్లకు పైగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు చర్చ సాగుతుంది.
భారీ బందోబస్తు
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ తర్వాత పులివెందులలో కొన్ని చెదురు ముదురు సంఘటనలు జరిగాయి. దీంతో ఇక్కడ 700 మందితో భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇక్కడ 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే పోలింగ్ రూటులో సీఐ స్థాయి అధికారి, పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐని ఏర్పాటు చేస్తున్నారు. పులివెందులలో మొత్తం సమస్యాత్మక కేంద్రాలు కావడంతో స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు డీఐజీ కోయప్రవీణ్ వెల్లడించారు. ఒంటిమిట్టలో సోమశిల అటవీ సమీప పరిధిలో ఉండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ కొందరు ఎర్రచందనం స్మగ్లర్లు ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఐజీ వెల్లడించారు.
చెకోపోస్టులు ఏర్పాటు
పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా కడప ఎస్సీ ఆధ్వర్యంలో 6 చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా సరిహద్దులో అద్దాలమర్రి బాట చెక్ పోస్టు, అనుగంపల్లె, పార్నపల్లె వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. అలాగే కనంపల్లె, నల్లగొండుగారిపల్లె, రాయలాపురం, చందమామ దాబా, అలవలపాడు రోడ్డుసర్కిల్, ఎర్రపల్లి వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, బంగారం, మద్యం తరలించకుండా నిఘా ఉంచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AndhraPradesh News And Telugu News