Minister Subhash Counter on Jagan: యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:25 PM
గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను అడ్డుకునేందుకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు.
అమరావతి, సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): యూరియాపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Vasamsetti Subhash) పేర్కొన్నారు. వైసీపీ ప్రతిపక్షం కాదు విషవృక్షమని విమర్శించారు. ఏపీలో యూరియా కొరత ఉందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. కేవలం రైతులను భయాందోళనలకు గురిచేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే వైసీపీ నేతలు విష ప్రచారానికి తెరలేపారని ధ్వజమెత్తారు.
జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ప్రతి ఏడాది సగటున 5 లక్షల టన్నుల యూరియా (Urea) మాత్రమే రైతులకు అందించారని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఖరీఫ్ సీజన్లో 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇప్పటికే ఆగస్టు నెలాఖరు నాటికి 5,69,712 టన్నులు, ఈ నెలలో 94,482 టన్నులు సరఫరా చేశామని స్పష్టం చేశారు. మరో 40 వేల మెట్రిక్ టన్నులు ఈ నెల 10వ తేదీలోగా రైతులకు చేరనుందని వెల్లడించారు మంత్రి వాసంశెట్టి సుభాష్.
యూరియా కొరత ఉందంటూ తప్పుడు కథనాలతో కృత్రిమ కొరతను సృష్టించడం వైసీపీ (YSRCP) దిగజారుడుతనానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు. గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను అడ్డుకునేందుకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నందిగామలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు
అనంతపురం వాసులకు బిగ్ అలెర్ట్.. 10న ట్రాఫిక్ మళ్లింపు
Read Latest Andhra Pradesh News and National News