Nara Lokesh On Cyclone: తుపాను తీరప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలి.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:48 PM
మొంథా తుపాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్.
అమరావతి, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాను (Montha Cyclone) ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు మంత్రి నారా లోకేష్.
ప్రస్తుత సమాచారం ప్రకారం కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సాయం అందించాలని సూచించారు. అవసరమైతే కూటమి పార్టీలకు చెందిన కేడర్ ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆజ్ఞాపించారు. తుపాను ప్రభావిత తీరప్రాంతాలు, లంక గ్రామాల్లోని ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఆయా శిబిరాల్లోని నిరాశ్రయులకు అవసరమైన ఆహారం, నీరు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్.
భారీ వర్షాల కారణంగా ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా వైద్యా, ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్స్లు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ఆ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపించారు. కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తకుండా సెల్ఫోన్ ఆపరేటర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్.
భారీవర్షాల కారణంగా చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలు, యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పంటపొలాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ఆయిల్ మోటార్లు సిద్ధంగా ఉంచుకోవాలని మార్గనిర్దేశం చేశారు. మొంథా తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను బాధితులకు ఎలాంటి సాయం అవసరమైన వెంటనే స్పందించేందుకు యంత్రాంగం 24 గంటలు సిద్ధంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు.. పాలక మండలి విజ్ఞప్తి
బస్సు దగ్ధం ఘటన.. డెడ్బాడీస్ అప్పగింత పూర్తి
Read latest AP News And Telugu News