Share News

Cyber Crime: మీ ఫొటోలపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. ప్రణవ్, త్రిష.. థ్రిల్లింగ్ ఎపిసోడ్‌లో ట్విస్టులే.. ట్విస్టులు..

ABN , Publish Date - Feb 23 , 2024 | 06:14 PM

ఏమవుతుందిలే అనుకుంటూ ఎక్కడ పడితే అక్కడ మీ ఫొటోలు ఇస్తున్నారా.. అలాగే మీ ఆధార్, పార్డ్ కార్డులు ఎవరికి పడితే వారికి ఇస్తున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్లే. రోజురోజుకూ ...

Cyber Crime: మీ ఫొటోలపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. ప్రణవ్, త్రిష.. థ్రిల్లింగ్ ఎపిసోడ్‌లో ట్విస్టులే.. ట్విస్టులు..

ఏమవుతుందిలే అనుకుంటూ ఎక్కడ పడితే అక్కడ మీ ఫొటోలు ఇస్తున్నారా.. అలాగే మీ ఆధార్, పార్డ్ కార్డులు ఎవరికి పడితే వారికి ఇస్తున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్లే. రోజురోజుకూ టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందుతోందో.. మరోవైపు సైబర్ నేరాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజూ మన కళ్ల ముందు చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సైబర్ మోసాల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో.. ఓ కోటీశ్వరురాలు, టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన థ్రిల్లింగ్ ఎపిసోడ్.. కళ్లకు కట్టినట్లు చెబుతోంది. వివరాల్లోకి వెళితే..

వాట్సప్ డీపీలతో..

ప్రస్తుత సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) తదితర అకౌంట్లు ఉండడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో ఇలా ఫొటోలు తీసుకుని అలా సోషల్ మీడియాలో అప్‪లోడ్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ ఫొటోలే మీకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టవచ్చు. ఆ ఫొటోలతో సైబర్ నేరగాళ్లు కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి, తద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. మహిళల వాట్సప్ డీపీ ఫొటోలను ఆధునిక టెక్నాలజీ సాయంతో నగ్నం మార్చి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఘటనలను కూడా గతంలో చాలా చూశాం. ఇలాంటి సమయాల్లో పరువు పోతుందనే ఉద్దేశంతో కొంతమంది.. నేరగాళ్లు అడిగిన మొత్తాన్ని ముట్టజెబుతారు. చివరకు వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయిస్తుంటారు.

‘మ్యాట్రిమోనియల్’.. వేదికగా..

హైదరాబాద్ నగరంలో తాజాగా ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రణవ్‌ అనే యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూనే.. ప్రముఖ టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పార్ట్‌‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడు. మరోవైపు త్రిష అనే యువతి డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తుండేది. ఈమె పలు స్టార్టప్ కంపెనీలకు యజమానురాలిగానూ వ్యవహరిస్తోంది. ఇలా వుండగా.. రెండేళ్ల క్రితం ప్రణవ్ ఫొటోను మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో చూసిన త్రిష.. అతన్నే పెళ్లి చేసుకోవాలని భావించింది.


ప్రణవ్ ఫొటోను వాడుకుని...

చైతన్య రెడ్డి అనే యువకుడు ప్రణవ్ ఫొటోను వాడుకుని మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ ద్వారా త్రిషతో పరిచయం పెంచుకున్నాడు. రోజూ ఆమెతో చాటింగ్ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో త్రిష.. ప్రణవ్ వివరాలు తెలుసుకుని నేరుగా అతన్నే సంప్రదించింది. చివరకు అసలు విషయం తెలుసుకున్న ప్రణవ్.. తన ఫొటోను ఏ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌కూ ఇవ్వలేదని చెప్పాడు. తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా లేదని చెప్పాడు. అయితే త్రిష మాత్రం అతన్నే వివాహం చేసుకోవాలని భావించింది. తననే పెళ్లి చేసుకోవాలని రెండేళ్లుగా అతడి వెంటపడుతోంది. అయినా ప్రణవ్ తిరస్కరిస్తూ వస్తుండడంతో చివరకు అతడిపై నిఘా ఉంచింది.

pranav-and-trisha.jpg

కిడ్నాప్ చేసి మరీ..

ప్రణవ్ ఏ సమయంలో ఎక్కడెక్కడికి వెళ్తున్నాడే తెలుసుకున్న త్రిష.. అతడిపై నిఘా ఉంచింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 11న రౌడీలకు సుఫారీ ఇచ్చి మరీ ప్రణవ్‌ను కిడ్నాప్ చేయించింది. అప్పటి నుంచి తన గదిలోనే బంధించింది. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే వదిలే ప్రసక్తి లేదంటూ బెదిరించసాగింది. అయితే ఇటీవల ప్రణవ్.. ఎలాగోలా ఆమె చెర నుంచి తప్పించుకుని నేరుగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఉప్పల్‌ పోలీసులు... త్రిషను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. కోట్ల ఆస్తులకు అధిపతి అయిన త్రిష.. ఇలా ఓ యువకుడిని బంధించి మరీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Updated Date - Feb 23 , 2024 | 06:14 PM