రుతుపవనాలు ప్రవేశించినా వర్షాలు తక్కువే..:ప్రఖర్ జైన్
ABN , Publish Date - Jun 06 , 2026 | 09:24 PM
రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. రానున్న 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అమరావతి, జూన్6 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. రానున్న 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రఖర్ జైన్ ఈరోజు(శనివారం) ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానిక వాతావరణ మార్పులతో కొంత మేర వర్షలోటు భర్తీ అయ్యే సూచనలు ఉన్నాయని తెలిపారు. రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. రైతులు పంట ప్రణాళికల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆ జిల్లాల్లో తక్కువ వర్షపాతం అవకాశం..
పోలవరం, గోదావరి జిల్లాలు, రాయలసీమలో తక్కువ వర్షపాతం అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అధిక వర్షపాతం సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. పల్నాడు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. 58 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 104 మండలాల్లో వడగాడ్పులు ఉన్నాయని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉందని వెల్లడించారు.
పలు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు
పలు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ చెప్పుకొచ్చారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని అన్నారు. ప్రజలు ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరించారు. రైతులు, పశుకాపరులు మేఘావృత వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎండలో బయటకు వెళ్లేవారు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలని తెలిపారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు
గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News