రంగు భలే.. తింటే రోగాలే..!
ABN , Publish Date - May 13 , 2026 | 01:30 PM
మామిడి పండ్లు మార్కెట్లోకి పోటెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి సీజన్ కావడంతో వెల్లువలా వస్తున్నా యి.
మామిడికాయలను కృత్రిమ పద్ధతుల్లో మాగపెడుతున్న వ్యాపారులు
చూసీచూడనట్లుగా వదిలేస్తున్న అధికారులు
మార్కెట్లో జోరందుకున్న విక్రయాలు
నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం
క్యాన్సర్ కారకానికి దారితీసే ప్రమాదం
మహబుబాబాద్: మామిడి పండ్లు మార్కెట్లోకి పోటెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి సీజన్ కావడంతో వెల్లువలా వస్తున్నా యి. పండ్లను సహజసిద్ధానికి భిన్నంగా కృత్రిమ పద్ధతుల్లో మాగపెడుతుండడంతో అవి తిన్న జనం రోగాలపాలవుతున్నారు. కొందరు వ్యా పారులు సహజ రుచి, వాసన, నాణ్యత లేకుండా పక్వానికి రాకముందే ‘కాల్షియం-కార్బైడ్’ వంటి రసాయనాలతో మాగపెట్టి విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు రోగాల బారిన పడుతున్నారు. సీజన్ల వారిగా ని త్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయాలు చేపడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
మామిడి పండ్ల సీజన్ ఆరంభమవడంతో బహిరంగ మార్కెట్లలో క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా మహబూబాబాద్, జనగామ జిల్లాలో మామిడి పంట అధికంగా పండిస్తుంటారు. ఏటా వ్యాపారులు తొందరగా పండేలా మామిడిని ఇథిలిన్పౌడర్, కాల్షియం-కార్బైడ్ రసాయనాలతో మాగపెడుతుంటారు. సాధారణంగా కల్షియం-కార్బైడ్ను పరిశ్రమలలో లూబ్రికెంట్స్గా సుమారు 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కోసం వాడుతుంటారు.
అలాంటి కాల్షీయం-కార్బైడ్ను పండ్లు మాగబెట్టేందుకు వినియోగిస్తుండటం పెను ప్రమాదకరమేనని ఆరోగ్య నిపులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలలో ఎక్కువ ఉష్ణోగ్రతల కోసం వాడే రసాయనాలను ప్రజల ఆరోగ్యంపై దుష్పప్రబావం చూపేలా ఉపయోగించడం సరైంది కాదంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అలాంటి రసాయనాల వాడకాన్ని అరికట్టేలా చర్యలు చేపట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చూపును ఆకర్షించే రంగులతో కనిపించే వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు చెబుతున్నారు.
వాడే రసాయనాలు..
మామిడి కాయలను త్వరగా పండించటానికి సాధారణంగా కాల్షియం-కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది తేమతో చర్య జరిపి ఎసిటిలీన్ వాయువును విడుదల చేస్తుంది. ఇది సహజ పండ్ల హార్మోన్ (ఇథలిన్) లాగా పనిచేసి పండిస్తుంది.
నిల్వ, బరువు తక్కువే..
తక్కువ కాలం నిల్వ ఉంటుంది. 2, 3 రోజుల్లోనే పండు తొక్కపై మచ్చలు కనిపిస్తాయి. 10-13 శాతం కంటే ఎక్కువ బరువును కోల్పోతుంది. అంతేకాక నీళ్లలో వేస్తే కృత్రిమంగా పండించిన పండ్లు తేలిపోతాయి.
గుర్తించడం ఎలా ?
కృత్రిమంగా పండిన మామిడి పండ్ల రంగు పైకి పచ్చగా.. లోపల తెల్లగా లేదా పాలిపోయినట్లు ఉంటాయి. కృత్రిమంగా పండించిన పండ్లల్లో సహజమైన రుచి, సువాసన కూడా ఉండదు. పుల్లగా ఉండి తక్కువ రుచిని కలిగిస్తుంది.
పండు సురక్షితమెలా..
ఇథిలీన్తో మాగబెడితే పండు సురక్షితంగా ఉంటుంది. తియ్యగా ఉండి మంచి రుచిని కలిగిస్తుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బరువు నష్టం కూడా 7-10 శాతం కంటే తక్కువగా ఉంటుంది.
ప్రమాదం..
కాల్షియం-కార్బైడ్లో ఆర్గానిక్ మరియు ఫాస్పరస్ వంటి హానికరమైన పదార్థాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో దీర్ఘ కాలంలో క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. జీర్ణాశయం, కాలేయం దెబ్బతినడం, మూత్రపిండ నాడీ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదముంది.
ఉమ్మడి జిల్లాల వారీగా పంట దిగుబడి వివరాలు...
జిల్లా రైతులు సాగు విస్తీర్ణం దిగుబడి
వరంగల్ 1,723 6,890 ఎకరాలు 13,780 మెట్రిక్ టన్నులు
హనుమకొండ 1,490 5,960 ,, ,, 11,920 ,, ,,
ములుగు 275 1,100 ,, ,, 2200 ,, ,,
భూపాలపల్లి 99 370 ,, ,, 740 ,, ,,
జనగామ 2,029 8,115 ,, ,, 16,230 ,, ,,
మహబూబాబాద్ 3,257 13,028 ,, ,, 26,056 ,, ,,
మొత్తం 8,866 35,463 ఎకరాలు 70,926 మె.టన్నులు
కృత్రిమ పండ్లతో ఆరోగ్యానికి హాని..
మామిడిని కాల్షియం, కార్బైడ్తో మాగబెట్టడం నేరం. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే ప్రమదం ఉంది. కృత్రిమ పండ్లకు బదులుగా ఆరోగ్యానికి హానికరం లేని ఇథిలీన్ వాయువు (ఇథిలీన్ గ్యాస్)ను వాడితే మంచిది. వరిగడ్డి, ఎండు ఆకులు, గాలి చొరబడని గదులలో ఉంచి మాగబెడితె పండు మేలుకరంగా ఉంటుంది.
జినిగు మరియన్న, ఉద్యాన శాఖ జిల్లా అధికారి
ఈ వార్తలు కూడా చదవండి:
అల్లు అర్జున్నే వదల్లేదు బండి భగీరథ్ను ఎందుకు వదిలేస్తాం
ఐపీఎల్ 2026: సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు జరిమానా
Read Latest AP News And Telangana News And International News And Telugu News