Share News

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి పొన్నం

ABN , Publish Date - May 01 , 2026 | 12:24 PM

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి పొన్నం
Minister Ponnam Prabhakar

సిద్దిపేట జిల్లా, మే1 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు. 140 సంవత్సరాలుగా ఏదో ఒక హక్కు డిమాండ్‌తో మేడే నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపోలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.


ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి వర్గం కార్మిక సంఘాలతో చర్చించి పలు అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నామని ప్రస్తావించారు. ఈ సమావేశంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం , కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించామని స్పష్టం చేశారు. త్వరలోనే కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియను గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ పూర్తి చేస్తుందని తెలిపారు.


ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని అన్నారు. ఆర్టీసీపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, కేబినెట్ మంత్రులు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. హైదరాబాద్‌లో కొత్తగా 380 రూట్‌లలో కొత్తబస్సులు నడుస్తున్నాయని చెప్పుకొచ్చారు. 7 లక్షల మంది ప్రయాణికులకు కనెక్టివిటీ పెంచామని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా.. ప్రభుత్వానికి వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. హక్కుల కోసం ఏవిధంగా పోరాడామో సంస్థ అభివృద్ధికి కార్మికులు సమష్టిగా పనిచేయాలని సూచించారు.


ములుగు జిల్లాలో ఉపాధి పనుల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

seethakka-minister.jpg

మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవపూర్‌లో ఉపాధి హామీ పనుల్లో పలుగు పట్టి కార్మికులతో కలిసి మంత్రి సీతక్క పనులు చేశారు. అనంతరం కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత అధికంగా ఉందని ఉదయం 10 గంటల వరకు పనులు ముగించుకొని ఇళ్లకు తిరిగి వెళ్లాలని కూలీలకు మంత్రి సీతక్క సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సంక్షేమ పథకాల్లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలు చేయాలి: సీఎం

పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 01 , 2026 | 12:33 PM