హార్వర్డ్కు పోయినా రేవంత్రెడ్డి భాష మారదు.. హరీశ్రావు సెటైర్లు
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:35 AM
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు కానీ.. స్కాం క్యాలెండర్ మాత్రం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
సిద్దిపేట, ఫిబ్రవరి 9, (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు కానీ.. స్కాం క్యాలెండర్ మాత్రం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్లో నెలకో కుంభకోణం వెలుగు చూస్తోందని ఆరోపించారు. రేవంత్రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా, అంతరిక్షానికి పోయినా ఆయన భాష మారదని సెటైర్లు గుప్పించారు. దుబ్బాకలో హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు ప్రసంగించారు.
రేవంత్రెడ్డి పాలనలో అభివృద్ధి శూన్యం..
రేవంత్రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని హరీశ్రావు విమర్శలు చేశారు. 420 హామీలు ఇచ్చి రెండున్నరేళ్లు అయిందని.. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేశారా అని ప్రశ్నించారు. ఒక్క బసు ఫ్రీ ఇచ్చారని... కానీ మగవాళ్లకు డబుల్ రేట్ చేశారని ధ్వజమెత్తారు. తాను పొడుగు ఉన్నానని, ఇంగ్లీష్ వస్తదని మాజీమంత్రి కేటీఆర్ను ఇంగ్లీష్ రాని రేవంత్రెడ్డి తిడుతున్నారని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ సర్కార్లో రెండుసార్లు రైతుబంధు ఇచ్చి.. మరో రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన హామీలను రేవంత్రెడ్డి బంద్ చేసిండు తప్ప.. కొత్తవి ఏమన్నా అమలు చేశారా అని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమే కేసీఆర్ చేసిన తప్ప అని ప్రశ్నించారు. దేవుడిని మోసం చేసిన రేవంత్రెడ్డి ప్రజలను కూడా మోసం చేస్తారని ఎద్దేవా చేశారు.
నీళ్లివ్వకపోతే కొట్లాడుతాం..
రేవంత్రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు రావడం లేదంటే.. ఇక్కడ తాను ఉన్నానని, కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాదని ఇక్కడకు రావట్లేదని హరీశ్రావు విమర్శలు చేశారు. కాళేశ్వరం కట్టింది కేసీఆర్.. కాలువలు తీసింది కేసీఆర్.. నీళ్లు ఇవ్వకపోవడానికి ఆయనెవరని నిలదీశారు. రేవంత్రెడ్డి నీళ్లు ఇవ్వకపోతే.. బరాబర్గా తాను, కొత్త ప్రభాకర్ రెడ్డి పోతామని గేట్లు ఎత్తుతామని, నీళ్లు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. పేదలకు అన్నం పెట్టే ఉపాధి హామీ పథకానికి బీజేపీ సర్కార్ సున్నం పెట్టిందని ధ్వజమెత్తారు. మొన్న బీజేపీ కేంద్రమంత్రి, నిన్న కాంగ్రెస్ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చారని.. ఒక్క రూపాయన్న ఇచ్చారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక్కడ గుడి, బడి కట్టింది కేసీఆరేనని చెప్పుకొచ్చారు. రేవంత్రెడ్డిని ప్రశ్నిస్తేనే పథకాలు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక భూముల ధరలు తగ్గాయని, రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని హరీశ్రావు విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రేవంత్రెడ్డి పాలనలో.. బస్సు తప్ప అన్నీ తుస్సే.. హరీశ్రావు సెటైర్లు
పాడి గేదెల పేరుతో భారీ మోసం.. పశువులను ఇంటికే పంపిస్తామంటూ..
Read Latest Telangana News And AP News And Telugu News