Share News

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌ రెడ్డి లేఖ.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 16 , 2026 | 02:43 PM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతి గురించి ప్రస్తావించారు.

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌ రెడ్డి లేఖ.. ఎందుకంటే..
Kishan Reddy

హైదరాబాద్, జనవరి16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) శుక్రవారం లేఖ రాశారు. ఈ లేఖలో హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతి గురించి ప్రస్తావించారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా నగరంలో మెట్రో రెండో దశ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిందని గుర్తుచేశారు. ఇప్పటికే అమలు జరుగుతున్న మొదటి దశ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, తామే నిర్వహిస్తామని ప్రకటించిందని ప్రస్తావించారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ని కలిసి మెట్రో రెండో దశ నిర్మాణం గురించి చర్చించానని వివరించారు కిషన్‌రెడ్డి.


లావాదేవీలు పూర్తి చేయాలి..

ముందుగా మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని, అందుకు అన్ని ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి చేయాలని సూచించారు. లావాదేవీలు పూర్తయిన తర్వాత రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి అంగీకరించిందని కూడా కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ గుర్తు చేశారని అన్నారు. మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ నుంచి తీసుకోవడం, రెండో దశకు సన్నాహాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి నిర్ణయించారని కూడా కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తనకు తెలిపారని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.


అధికారుల పేర్లను పంపించాలి..

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం తరఫున మరో ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకోసం రాష్ట ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని కోరినట్లు కూడా వివరించారు. కానీ, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను ఎందుకు ప్రతిపాదించలేదని ప్రశ్నించారు. కావున సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ఇద్దరు అధికారుల పేర్లను పంపి సమావేశ నిర్వహణకు ప్రయత్నం చేయాలని సూచించారు. అదేవిధంగా, వేగవంతంగా ఎల్ అండ్ టీ నుంచి మెట్రో నెట్‌వర్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత మెట్రో రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కిషన్‌రెడ్డి కోరారు.


ఇవి కూడా చదవండి...

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం ఏం తేల్చనుంది

సంక్రాంతి వేళ దొంగల హల్‌చల్.. చెంగిచెర్లలో భారీ చోరీలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 16 , 2026 | 05:17 PM