క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్రెడ్డి
ABN , Publish Date - Jul 09 , 2026 | 06:19 PM
క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్, జులై 9 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దేశానికి అకాడమీలు, వసతులు అవసరమని తెలిపారు. ఈరోజు (గురువారం) గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను సీఎం ప్రారంభించారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీని ప్రారంభించారు. స్పోర్ట్స్ వర్సిటీ వెబ్సైట్, లోగో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో IOA అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు.
క్రీడల్లో భారత్ వెనుకబడి ఉంది..
క్రీడల్లో భారత్ వెనుకబడి ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రీడల పతకాల పట్టికలో.. భారత్ అట్టడుగు స్థానంలో ఉంటోందని అన్నారు. క్రీడాకారులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సూచించారు. పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. దేశం గర్వించే క్రీడాకారులు, వ్యాపారవేత్తలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. ఏ రంగంలోనైనా కష్టపడేవారు తప్పకుండా రాణిస్తారని అన్నారు. క్రీడలపై యువత దృష్టి సారించాలని సూచించారు. యువతే ఈ దేశ సంపద అని వ్యాఖ్యానించారు.
పీటీ ఉష దేశానికి పేరు తెచ్చారు..
ఒలింపిక్స్లో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అత్యంత వెనుకపడిందని సీఎం తెలిపారు. ప్రభుత్వాలకు ఒక విధానం లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. అప్పుడప్పుడు పీటీ ఉష లాంటి క్రీడాకారులు క్రీడల్లో దేశానికి పేరు తీసుకువచ్చారని ప్రశంసించారు. క్రీడల్లో రాణించడం వల్లే పీటీ ఉషకు గుర్తింపు వచ్చిందని కొనియాడారు. క్రీడల్లో రాణించి ఆమె రాజ్యసభ సభ్యురాలి స్థాయికి చేరారని ప్రశంసించారు. ప్రపంచ దేశాల్లో భారత్ను క్రీడల్లో రాణించిన దేశంగా గుర్తించడం లేదని అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చిందని వివరించారు.
లక్ష్యాన్ని చేరాలంటే వందశాతం కష్టపడాల్సిందే..
స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ విధానంలో ప్రారంభించామని సీఎం వెల్లడించారు. లక్ష్యాన్ని చేరాలంటే వందశాతం కష్టపడాల్సిందేనని సూచించారు. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్కు వేదికగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలతో పాటు నగదు పారితోషికం ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 2028 నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వివరించారు. క్రీడల్లో రాణిస్తే మీ భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. క్రీడల్లో రాణించి దేశానికి పేరు తీసుకువస్తే మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్తో హైకమిషనర్ భేటీ
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ సర్కార్పై కిషన్రెడ్డి ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News