Share News

మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి మాట్లాడండి: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jun 15 , 2026 | 02:43 PM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి మాట్లాడండి: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) రాజీనామా చేస్తారా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి మాట్లాడండి’ అంటూ ప్రతి సవాల్ విసిరారు.ఈరోజు(సోమవారం) సచివాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ముందుగా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దేశ ప్రజలకు ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.


ఈ హామీలు ఎంతవరకు అమలయ్యాయో దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, ప్రతి ఖాతాలో రూ.15 లక్షల జమ వంటి కీలక హామీలు నెరవేర్చకపోయినా వాటిపై ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కిషన్‌రెడ్డి ముందుగా వీటికి సమాధాని చెప్పాలని నిలదీశారు. ఎన్నికల హామీలు అమలు కాలేదనే కారణంతో ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడితే, తాను కూడా తన కేబినెట్‌ను రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం స్పష్టం చేశారు.


మెట్రో విస్తరణను బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయి..

మెట్రో విస్తరణను బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో విస్తరణ జరిగేచోట బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారని తెలిపారు. సమస్యలపై మాట్లాడదామంటే కేంద్రమంతి కిషన్‌రెడ్డి సమయం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకుని మాట్లాడాలని సూచించారు. మెట్రో విస్తరణకు కిషన్‌రెడ్డి నిధులు విడుదల చేయిస్తారా? లేదా? అని ప్రశ్నించారు. లోన్‌ బదిలీ కాకుండా కిషన్‌రెడ్డి వల్లే మెట్రో విస్తరణ ఆగిందని ఆరోపించారు. మెట్రో విస్తరణకు రూ.40 వేల కోట్లు కావాలని సూచించారు. అంతా తామే భరిస్తామని.. NOC ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా మెట్రోను తాము విస్తరిస్తామని కేంద్ర పెద్దలతో తాము చెప్పామని పేర్కొన్నారు


మెట్రోపై కిషన్‌రెడ్డి కుట్ర పన్నారు..

రాజకీయంగా నష్టం జరుగుతోందని మెట్రోపై కిషన్‌రెడ్డి కుట్ర పన్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రుణం ఇవ్వకపోతే కనీసం NOC అయినా ఇప్పించరా? అని నిలదీశారు. నిధులు ఇప్పించి NOC ఇస్తే శాలువా కప్పి ఆయనను సన్మానిస్తామని తెలిపారు. కిషన్‌రెడ్డిని కేసీఆర్ తిట్టినట్లు తాను తిట్టలేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే కేంద్రమంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు లొంగిపోయి కిషన్‌రెడ్డే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఆయన వెనుక కేటీఆర్‌ ఉన్నారని ఆరోపించారు. కేటీఆర్‌ కుట్రలకు కేంద్రమంత్రి సహకరిస్తున్నారని ఆక్షేపించారు.కేటీఆర్‌ కుట్రలు చేస్తుంటే.. కిషన్‌రెడ్డి అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.


కేటీఆర్‌ చెప్పిందే కిషన్‌రెడ్డి చేస్తున్నారు..

కిషన్‌రెడ్డికి అంత తెలివిలేదని.. కేటీఆర్‌ చెప్పిందే చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. మెట్రోలో ప్రయాణించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచిస్తున్నారని తెలిపారు. ప్రధాని సూచనలను తాము అమలు చేయాలని చూస్తుంటే.. ఆయన ఎందుకు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఫేజ్‌-1ను కేంద్రం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఫేజ్‌-2 నిర్మించుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌ మెట్రోకు అనుమతులు, నిధులు వచ్చాయని ప్రస్తావించారు. హైదరాబాద్‌కు మాత్రం అనుమతులు, నిధులు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. విశాఖపట్నం మెట్రో నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చారని తెలిపారు. తెలంగాణపై కేంద్రానికి ఎంత వివక్ష ఉందో ఈ విషయంలో అర్థమవుతోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

చిన్న తప్పులకూ ఉద్యోగ బహిష్కరణ సరికాదు: సుప్రీంకోర్టు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 15 , 2026 | 03:57 PM