బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:07 PM
భారత రాష్ట్ర సమితి మరో ముఖ్యమైన సమావేశానికి సిద్ధమవుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): భారత రాష్ట్ర సమితి (BRS) మరో ముఖ్యమైన సమావేశానికి సిద్ధమవుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ హైకమాండ్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో రజతోత్సవ సంబరాల ముగింపు సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, సంస్థాగతంగా పార్టీని బలపరిచే అంశాలపై గులాబీ బాస్ మార్గనిర్దేశం చేయనున్నారు.
సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ఫోకస్..
ఈ సమావేశంలో బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై గులాబీ కేడర్కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడం, కొత్త కమిటీల ఏర్పాటు, నాయకత్వ బాధ్యతల పునర్వ్యవస్థీకరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే సభ్యత్వాల పునరుద్ధరణ కార్యక్రమంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలు రూపొందించనున్నట్లు సమాచారం.
సమావేశానికి ముఖ్య నేతలు...
ఈ సమావేశానికి బీఆర్ఎస్ కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు పాల్గొననున్నారు. ఈ సమావేశం ద్వారా పార్టీ అంతర్గత సమన్వయాన్ని బలోపేతం చేయడమే కాకుండా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ సమగ్ర సమీక్ష చేయనున్నారు.
భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలపై చర్చ..
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొత్త సమీకరణాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తన వ్యూహాన్ని పునర్నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సమావేశం భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలు, ప్రజల్లో తిరిగి బలం పెంపొందించుకోవడం, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయడంపై దృష్టి సారించనుంది. బీఆర్ఎస్ ప్రస్తుతం తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడానికి ప్రయత్నిస్తోంది. గ్రామస్థాయి నాయకత్వం నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయం పెంచడం, యువతను ఆకర్షించడం, పాత సభ్యత్వాలను తిరిగి క్రియాశీలం చేయడం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానునట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీన తెలంగాణ భవన్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు సమావేశం పార్టీ భవిష్యత్తు దిశను నిర్ణయించే కీలక ఘట్టమని కేడర్ భావిస్తోంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ద్వారా గులాబీ పార్టీ తన రాజకీయ వ్యూహాలను పునరుద్ధరించుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
నాకు శాపాలు పెడతారా.. కాంగ్రెస్ సర్కార్పై కేసీఆర్ ధ్వజం
నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News