తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ ప్యానెల్స్ స్కాం : ఎంపీ రఘునందన్ రావు
ABN , Publish Date - Aug 11 , 2026 | 04:54 PM
పీఎం సూర్యఘర్ పథకం కింద తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ ప్యానెల్స్ కుంభకోణం జరిగిందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం రఘునందన్ రావు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పీఎం సూర్యఘర్ పథకం కింద తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ ప్యానెల్స్ కుంభకోణం జరిగిందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) ఆరోపించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ఈరోజు (మంగళవారం) రఘునందన్ రావు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో 40 వేల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ పెట్టే పేరుతో ఇంటికి రూ.50 వేల చొప్పున రూ.200 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న కుంభకోణాన్ని కేంద్రమంత్రికి వివరించానని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోరారు.
ఈ స్కాంపై విచారణ జరపాలి..
ఈ స్కాంపై విచారణ జరుపుతామని కేంద్రమంత్రి చెప్పారని రఘునందన్ రావు అన్నారు. ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొండారెడ్డిపల్లి మొత్తం సోలార్ ప్యానెల్స్ ఘనత కేంద్రప్రభుత్వానిదని సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని అన్నారు. డబ్బు కేంద్ర ప్రభుత్వానిది.. సోకు మాత్రం కాంగ్రెస్ది అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని తీసుకుంటూ కేంద్రం ఏమి చేయలేదని రేవంత్రెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ అంటేనే కరప్షన్..
కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే వందల కోట్ల అప్పులు ఎలా తీరుస్తున్నారో రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు పేరుతో కేంద్రప్రభుత్వ పథకాలను, నిధులను దారి మళ్లిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వ సూర్యఘర్ పథకం అమలు చేయడానికి 40 వేల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. కేంద్రప్రభుత్వ పథకం సబ్సిడీ నిధులను రేవంత్రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. రూ.1.36 లక్షలకు ప్రతి ఇంటిపైనా సోలార్ ప్లేట్లను పెట్టేందుకు ఒక కంపెనీ టెండర్ దక్కించుకుందని ప్రస్తావించారు. ఆ సంస్థ నుంచి మరో కంపెనీ ఇంటికి రూ.86 వేలతో సోలార్ ప్లేట్లు పెట్టే పనులు తీసుకుందని తెలిపారు. ఇక్కడ ఇంటికి రూ.50 వేలు ఎవరు తీసుకున్నారు.? అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
వార్తలు కూడా చదవండి...
'హర్ ఘర్ తిరంగా' అభియాన్లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్
ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?
Read Latest AP News And Telangana News And National News
And Telugu News