జగన్ హయాంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:11 PM
విజయనగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
విజయనగరం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూవివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు (Pusapati Ashok Gajapathi Raju) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. తమ కుటుంబానికి సంబంధించిన భూమి రికార్డులను తారుమారు చేసి, ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపించే ప్రయత్నించారని అన్నారు. ఈ అంశంపై తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘మా స్థలానికి సంబంధించిన రికార్డులను మార్చేశారు. అసలు ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా ఎలా మార్చగలిగారు?’ అని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. ఈ వివాదంలో అసలు సమస్యను పక్కదారి పట్టించే విధంగా కొన్నివర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని, సంబంధిత అధికారులకు ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేశామని తెలిపారు. అయితే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం జరగాలని, భూ రికార్డులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన హక్కులను కాపాడేందుకు అవసరమైన అన్నిమార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి: అనిత
ట్రంప్, పుతిన్లకు కూడా ఫిర్యాదు చేయండి.. నానిపై శివనాథ్ సెటైర్లు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News