ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోంది: లోకేశ్
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:20 PM
ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువత ముఖంలోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని పేర్కొన్నారు.
విశాఖపట్నo, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ స్థాయి క్రీడాకారులను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. యువత ముఖంలోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని పేర్కొన్నారు. పీవీ సింధు అకాడమీ ద్వారా క్రీడాకారులు వారిలోని ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. ఎలాంటి సదుపాయాలు లేని రోజుల్లోనే పట్టుదల, క్రమశిక్షణతో సింధు ఒలింపిక్స్ పతక విజేతగా, ప్రపంచ ఛాంపియన్గా ఎదిగారని ఉద్ఘాటించారు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో తలపెట్టిన పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేశ్ ఈరోజు (బుధవారం) భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు.
క్రీడలకు నిలయంగా ఈ అకాడమీ..
ప్రతి ఛాంపియన్ వెనుక కష్టపడిన తల్లిదండ్రులు, ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచే కోచ్లు ఉంటారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. కేవలం బ్యాడ్మింటనే కాకుండా, అన్ని రకాల క్రీడలకు కేంద్రంగా ఈ అకాడమీని తీర్చిదిద్దాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ అకాడమీ రూపుదిద్దుకుంటోందని వివరించారు. ఈ సంస్థ బ్యాడ్మింటన్కే పరిమితం కాకుండా.. స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్లిఫ్టింగ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ క్రీడలకు కూడా నిలయంగా మారనుందని వెల్లడించారు. ఆస్ట్రేలియా, ఖతార్ తరహాలో మన దేశంలోనూ ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు ఈ సంస్థ వేదిక కానుందని తెలిపారు.
క్రీడా విప్లవానికి చంద్రబాబు బాటలు వేశారు..
విశాఖపట్నంలో ఈ అకాడమీ నిర్మాణం విజయవంతం కావడానికి తమ ప్రభుత్వం, ప్రజల సహకారం ఎప్పుడూ ఉంటుందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. 90వ దశకంలోనే క్రీడలపై సీఎం చంద్రబాబు నమ్మకం ఉంచారని ప్రస్తావించారు. ఆ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు ప్రాధాన్యం కల్పించి క్రీడా విప్లవానికి చంద్రబాబు బాటలు వేశారని ఉద్ఘాటించారు. ఈ అకాడమీ కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా, అనేక క్రీడలకు కేంద్రంగా మారి ఆంధ్రప్రదేశ్లో క్రీడా సంస్కృతిని పెంచుతుందని వివరించారు. తరగతి గది జ్ఞానాన్ని ఇస్తే, క్రీడలు మనకు వ్యక్తిత్వాన్ని, పోరాట పటిమను నేర్పుతాయని చెప్పుకొచ్చారు. అందుకే ఏపీలో ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే'గా ప్రకటించామని తెలిపారు. ప్రతి చిన్నారిలోనూ ఒక సహజ ప్రతిభ దాగి ఉంటుందని వివరించారు. దానిని వెలికితీసి ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు.. ఆ ల్యాండ్స్ను మానిటైజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు
జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలి: పవన్ కల్యాణ్
లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి.. వైసీపీపై మంత్రి అనగాని ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News