వైసీపీ ఆర్థిక విధ్వంసం వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కు.. పవన్ కల్యాణ్ ధ్వజం
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:33 AM
జగన్ హయాంలో ఆర్థిక విధ్వసం చేసి, ఏపీని గందరగోళంలోకి నెట్టివేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆర్థిక విధ్వంసం వల్ల ఏపీ 30ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో ఆర్థిక విధ్వసం చేసి, ఏపీని గందరగోళంలోకి నెట్టివేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆర్థిక విధ్వంసం వల్ల ఏపీ 30ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ద్రవ్యవినిమయ బిల్లుపై పవన్ కల్యాణ్ అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రి పయ్యావుల కేశవ్ అసెబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 3.32లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. సామాజిక భద్రత పెన్షన్ల కోసమే రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఇలాంటి పరిస్థితిని తట్టుకోవటం, పథకాలు ఇవ్వటానికి సీఎం చంద్రబాబుకు ఎంతో ధైర్యం ఉండాలని ప్రశంసించారు.
విద్యుత్ సంస్థలకు నష్టం..
ఈ సందర్భంగా ‘నేను నాటిన చెట్ల ఫలాలు నా కోసం కాదని... భావితరాల కోసం’ అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తులను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. బడ్జెట్లో చంద్రబాబు దూరదృష్టి, దక్షత, దార్శనికత అడుగడుగునా ఉందని కొనియాడారు. వైసీపీ హయాంలో చేపట్టిన విద్యుత్ కొనుగోళ్ల కారణంగా డిస్కంలకు రూ.12,250కోట్ల నష్టం వచ్చిందని చెప్పుకొచ్చారు. కరెంట్ సరఫరాలో కూడా ఇబ్బందులు వచ్చాయని వివరించారు. రూ.1.29 లక్షల కోట్లు విద్యుత్ సంస్థలు నష్టపోయాయని.. ఆ భారాన్ని ప్రజలపై మోపారని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రూఅప్ చార్జీలు రద్దు చేసి ట్రూడౌన్ పేరిట ఛార్జీలు తగ్గించామని ప్రస్తావించారు.
రూ.9లక్షల కోట్ల మేర అప్పులు..
వైసీపీ ప్రభుత్వం రూ.9లక్షల కోట్ల మేర అప్పులు తమపై ఉంచి వెళ్లిందని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. రూ.35వేల కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టి వెళ్లారని.. అందులో రూ.25వేల కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా రూ.7వేల కోట్లకు పైగా జత చేశామని వెల్లడించారు. గతంలో వైసీపీ రాష్ట్ర వాటా ఇవ్వకపోవటం వల్ల రూ.8,700 కోట్లు జలజీవన్ మిషన్ నిధులు నిరుపయోగమయ్యాయని చెప్పుకొచ్చారు. వైసీపీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన అనేక ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వంలో ప్రారంభించామని తెలిపారు. జలజీవన్ మిషన్కు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్
ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..
Read Latest Telangana News And AP News And Telugu News