జగన్ హయాంలో ఇళ్ల పథకం నిర్వీర్యం: మంత్రి కొలుసు పార్థసారథి
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:34 PM
కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ పేదల గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి (AP Minister Kolusu Parthasarathy) స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ పేదల గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. అదే విధానాన్ని ఇప్పుడు మరింత వేగంగా అమలు చేస్తున్నామని వివరించారు. రెండేళ్ల గృహనిర్మాణ శాఖ ప్రగతిపై మంత్రి కొలుసు పార్థసారధి మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో గృహ నిర్మాణానికి అవసరమైన నిధులు సరైన స్థాయిలో విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. వివిధ దశల్లో ఉన్న దాదాపు 4 లక్షల ఇళ్ల ప్రాజెక్టులు రద్దు చేశారని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 15.54 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటికే 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేశాం..
జగన్ హయాంలో నిలిపివేసిన గృహ నిర్మాణాలను తిరిగి ప్రారంభించి, ఇప్పటికే 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. అదేవిధంగా మిగిలిన 4.14 లక్షల ఇళ్లను కూడా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. గృహ నిర్మాణ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి దాన్ని రెండేళ్లు పొడిగించినట్లు స్పష్టం చేశారు. జగన్ హయాంలో పేదల ఇళ్ల కోసం సరైన నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. దాదాపు ఆరు లక్షల ఇళ్లకు కేవలం రూ.15 వేలే సహాయం ఇచ్చినట్లు తెలిపారు. 2014 నుంచి 2019 కాలంలో రాష్ట్ర వాటా రూ.50 వేలుగా ఉండగా, హుద్హుద్ తుఫాన్ తర్వాత విపత్తు సహాయంగా దాతల ద్వారా రూ.2 లక్షల వరకు నిధులు సమకూర్చినట్లు గుర్తుచేశారు. అర్బన్ హౌసింగ్ యూనిట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను రూరల్ కేటగిరీగా పరిగణించిందని తెలిపారు. అయితే తుడా, సీఆర్డీఏ వంటి ప్రాంతాల్లో అర్బన్ హౌసింగ్ అమలుకు అంగీకారం లభించిందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనపు నిధులు
ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేని లబ్ధిదారులను గుర్తించి ఎస్సీ, ఎస్టీలకు అదనపు నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అదే విధంగా బీసీలకు కూడా అదనపు ఫండింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుమారు 15 లక్షల ఇళ్ల మంజూరులో కనీసం 9 లక్షల ఇళ్లు ఎందుకు పూర్తికాలేదని సీఎం అడిగారని చెప్పారు. ఈ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సాయికృష్ణ ఘటనపై సీఐ నాగరాజు సస్పెండ్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News