Share News

స్థానిక ఎన్నికలకు జనసేన సన్నద్ధం

ABN , Publish Date - Aug 28 , 2026 | 05:28 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సన్నద్ధమవుతోంది. ఈక్రమంలోనే విధివిధానాల‌ రూపకల్పనపై 14 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

స్థానిక ఎన్నికలకు జనసేన సన్నద్ధం
AP Minister Kandula Durgesh

అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సన్నద్ధమవుతోంది. ఈక్రమంలోనే విధివిధానాల‌ రూపకల్పనపై 14 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలపై తొలి సమావేశం ఈరోజు (శుక్రవారం) మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగింది. ఆయా జిల్లాల వారీగా బలాబలాలు, పోటీ చేసే స్థానాలపై ఈ సమావేశంలో అగ్రనేతలు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.


ఈ ఎన్నికల్లో కూటమి పొత్తుధర్మం పాటిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలపై ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2021లో జరిగిన‌ స్థానిక ఎన్నికల్లో ముందుకొచ్చిన జనసైనికులు, వీరమహిళలు ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల పొత్తుధర్మం పాటిస్తామని వ్యాఖ్యానించారు.


స్థానిక ఎన్నికలపై కీలక అంశాలపై చర్చించామని మంత్రి తెలిపారు. యూత్‌ను లీడర్ షిప్ దిశగా తీసుకెళ్లేలా నిర్ణయించామని అన్నారు. ఈ ఎన్నికలపై 25 పార్లమెంట్‌లకు ప్రాతినిధ్యం అప్పగిస్తారని వెల్లడించారు. సెప్టెంబరు నెల అంతా పార్టీ బలోపేతం, నాయకత్వం బలంగా ఉండేలా చూసుకుంటామని చెప్పుకొచ్చారు. స్థానికంగా ఉండే పరిస్థితుల ఆధారంగా పోటీ చేయడంపై దృష్టిపెడతామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.


స్థానిక ఎన్నికల్లో క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని వారిని గెలిపించాలని నిర్ణయించాం: ఎంపీ బాలశౌరి

స్ధానిక ఎన్నికల్లో జనసేన ఎక్కడ పోటీ చేయాలనే విషయాలపై ఆత్మీయ సమావేశంలో చర్చించామని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తెలిపారు. 2019 కంటే జనసేన ప్రాబల్యం పెరుగుతోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో సీట్ల శాతం పెరిగితే బాగుంటుందని అనుకుంటున్నామన్నారు. తాము పోటీ చేసే స్థానాల్లో గెలవాలని నిర్ణయించామని తెలిపారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని వారిని స్థానిక ఎన్నికల్లో గెలిపించాలని నిర్ణయించామని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.


1000 మందికి ఘన సన్మానం

జనసేన స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ఆత్మీయ సమావేశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెగువతో పోటీ చేసిన 1000 మంది జనసేన అభ్యర్థులను సత్కరించారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అభ్యర్థులకు ఘనంగా సన్మానించారు.1000 మంది అభ్యర్థులను మంత్రి నాదెండ్ల మనోహర్ సత్కరించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన వారికి జనసేన పార్టీ గౌరవం ఇచ్చింది. అభ్యర్థుల సత్కారంతో ఈ ఎన్నికల సన్నద్ధత సమావేశం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో పార్టీ కోసం నిలబడిన వారికి జనసేన అధినాయకత్వం ప్రత్యేక గౌరవం ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ

నేపాల్ వరదలు.. ఏపీ వాసులు గల్లంతు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 05:52 PM